చిట్ఫండ్ కంపెనీలు ప్రాణాలు తీస్తున్నాయి.. తస్మాత్ జాగ్రత్త..!
హైదరాబాద్ : చిట్ఫండ్ కంపెనీలు రెచ్చిపోతున్నాయి. చిట్టీల పేరిట మధ్యవర్తుల ప్రాణాలు తీస్తున్నాయి. చిట్టీలు ఎత్తుకునే వినియోగదారులకు సవాలక్ష ఆంక్షలు పెట్టే కంపెనీలు.. నెలనెలా వసూలు చేసుకునే విషయంలో కర్కశంగా ప్రవర్తిస్తున్నాయి. కొత్త చిట్టీలు ప్రారంభించినప్పుడు తీపి మాటలు చెప్పి వినియోగదారులను చేర్చుకునే సంస్థలు.. వారికి సేవలందించే విషయంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. చిట్టీ ఎత్తుకున్న తర్వాత కూడా ఆ మొత్తం ఇవ్వడానికి నెలలకు నెలలు ఆపుతున్నాయనే వాదనలున్నాయి.
టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. జడ్పీ పోరులో టఫ్ ఫైట్.?
ఇక చిట్టీలు ఎత్తుకుని నెల, రెండు నెలలు సక్రమంగా కట్టని కస్టమర్లను వేధింపులకు గురిచేస్తున్నారు చిట్ఫండ్ కంపెనీల సిబ్బంది. ఆ క్రమంలో ష్యూరిటీలు ఇచ్చే మధ్యవర్తులకు కూడా ఆయా సంస్థల నుంచి తిప్పలు తప్పడం లేదు. తాజాగా శ్రీరాం చిట్ఫండ్ మేనేజర్ల బాధ తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్న ఘటన చర్చానీయాంశంగా మారింది.
కస్టమర్లకు చుక్కలు.. ష్యూరిటీలకు తిప్పలు..!
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న చిట్ఫండ్ కంపెనీలు పేద, మధ్యతరగతి ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. సేవింగ్స్ కోసమో, ఆర్థిక అవసరాల కోసమో చాలామంది చిట్ఫండ్ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. అయితే చిట్టీలు మధ్యలో ఎత్తుకునేవాళ్లకు కొన్ని సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. గ్యారంటర్ కావాలంటూ, ష్యూరిటీ సంతకాలంటూ సవాలక్ష కండిషన్లు తెరమీదకు తెస్తాయి. అలా నెలల తరబడి వారు పాడుకున్న చిట్టీ డబ్బులు ఇవ్వడానికి ముప్పుతిప్పలు పెడతాయి.
అదలావుంటే, చిట్టీలు ఎత్తుకుని నెలనెలా వాయిదాలు కాస్తా లేటుగా కట్టేవాళ్లకు చిట్ఫండ్ కంపెనీల సిబ్బంది చుక్కలు చూపిస్తారు. ఫైన్లంటూ ముక్కుపిండి అదనపు సొమ్ము వసూలు చేస్తారు. ఒకవేళ వాళ్లు కట్టకుంటే ష్యూరిటీల మీద పడతారు.
వేధింపులతో వ్యక్తి సూసైడ్
తాజాగా హైదరాబాద్ లో వెలుగుచూసిన ఘటన చిట్ఫండ్ కంపెనీల అరాచకాలకు పరాకాష్టగా నిలుస్తోంది. చిలకలగూడకు చెందిన ప్రదీప్ కుమార్ ఈస్ట్ మారేడుపల్లిలోని శ్రీరాం చిట్ఫండ్ కంపెనీలో 2 లక్షలకు చిట్టీ వేశారు. అతడు చిట్టీ పాడుకుని డబ్బులు తీసుకున్న కొద్దిరోజులకే అనారోగ్యంతో చనిపోయారు. అయితే ష్యూరిటీగా ఉన్న నాగన్న (59సం.) ను మిగతా డబ్బు చెల్లించాలని సదరు కంపెనీ మేనేజర్లు జగదీశ్, సుదర్శన్ రావు తీవ్ర స్థాయిలో వత్తిడి తెచ్చారు.
ఆ మొత్తం కడతావా లేదా అంటూ ఇటీవల అతడిని సంస్థ కార్యాలయానికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే వారి వేధింపులు భరించలేకపోతున్న నాగన్న.. ముందుగానే తన వెంబడి పురుగుల మందు తెచ్చుకున్నాడు. అక్కడకు వెళ్లాక మరోసారి వేధించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఆ క్రమంలో శ్రీరాం చిట్ఫండ్ మేనేజర్లు ఇద్దరినీ అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేశారు పోలీసులు.
వెలుగులోకి కొన్నే..!
ఇలా చిట్ఫండ్ కంపెనీల బాధలు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నవారు చాలామందే ఉంటున్నారు. కాన్నీ అన్ని సంఘటనలు వెలుగులోకి రాకపోవడంతో వాస్తవాలు మరుగునపడుతున్నాయి. ఇక కొన్ని సందర్భాల్లో చిట్ఫండ్ కంపెనీల రికవరీ టీమ్స్ వ్యవహరించే తీరు అమానుషంగా ఉంటోంది. కుటుంబ యజమాని అనారోగ్యం కారణంతో చనిపోతే.. నెలనెలా వాయిదాలు కట్టాలంటూ కుటుంబ సభ్యులను వేధిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. కాస్తా ఆలస్యమైంది, కడతామంటూ సర్ధిచెప్పినా వారు వినిపించుకోక తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తారనే ఆరోపణలున్నాయి.
ఇక ఎలాంటి అనుమతులు లేకుండా, రూపాయి ట్యాక్స్ కట్టకుండా ప్రైవేట్ గా చిట్టీలు నడిపే వారి అరాచకాలకు అంతుపొంతు లేదు. చిట్టీలు ఎత్తుకున్నవాళ్లు నెలనెలా వాయిదాలు కాస్తా ఆలస్యమైతే చాలు రౌడీలతో బెదిరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.