ఘోర రోడ్డు ప్రమాదం... చౌటుప్పల్లో కారు బీభత్సం.. పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్న జంట మృతి...
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్స్పీడ్తో దూసుకొచ్చిన కారు సిగ్నల్ పాయింట్ వద్ద ఆగివున్న రెండు బైక్స్,ఒక స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బైక్స్ ధ్వంసమవగా... స్కూటీ దగ్ధమైంది. దీంతో స్కూటీపై ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పాటు స్కూటీపై వెళ్తున్న యువకుడు కూడా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి.
మృతులను రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన శ్రీలత,నాగరాజులుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకునేందుకు కొండగట్టుకు వెళ్తున్నట్లు గుర్తించారు. పెళ్లితో ఒక్కటవాల్సిన వాళ్లను ఇలా మృత్యువు కబళించడం స్థానికంగా విషాదం నింపింది. స్కూటీ నుంచి పెట్రోల్ లీక్ అవడం వల్లే వాహనం దగ్ధమైనట్లు తెలుస్తోంది. వీరి వెనకాలే బైక్పై వస్తున్న నాగరాజు చిన్నమ్మ,బాబాయ్ల బైక్ను కూడా కారు ఢీకొట్టింది. దీంతో వాళ్లు కూడా గాయాలపాలయ్యారు.
Recommended Video
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బ్రీజా కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతుండగా... బ్రేకులు ఫెయిల్ అవడం వల్లే ప్రమాదం జరిగిందని అందులో ఉన్నవారు చెబుతున్నారు. కారు యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.