గ్రేటర్లో సిటీ బస్ సర్వీసుల ప్రారంభం..? ఎప్పటినుంచో తెలుసా..?
లాక్ డౌన్ 5.0లో చాలా రంగాలకు సడలింపులనిచ్చిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థలు,థియేటర్స్ మినహా దాదాపుగా ఎకనమిక్ యాక్టివిటీస్ అన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణలో అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలు,పారిశ్రామిక కార్యకలాపాలు పున:ప్రారంభమయ్యాయి. అయితే హైదరాబాద్లో సిటీ బస్సులు,మెట్రో,ఎంఎంటీఎస్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో.. ఆఫీసులకు,పనులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Recommended Video
ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ బుధవారం(జూన్ 3) ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 8వ తేదీ నుంచి గ్రేటర్లో సిటీ బస్సులను నడిపేందుకు ఆయన సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ బస్సులు నడుస్తుండటంతో.. హైదరాబాద్లోనూ బస్సు సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
సాధారణంగా హైదరాబాద్లో ప్రతీరోజూ దాదాపు 33 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం సిటీ బస్సులు లేకపోవడంతో సొంత వాహనాల పైనే ఆధారపడుతున్నారు. సొంత వాహనాలు లేనివారు దూర ప్రాంతంలో ఉన్న తమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం జూన్ 8 నుంచి సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. వీరికి కష్టాలు తప్పుతాయి. అయితే కరోనా నేపథ్యంలో సిటీ బస్సుల్లో రద్దీని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతారన్నది వేచి చూడాలి.
మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేటు దారుణంగా పడిపోయింది. సాధారణ రోజుల్లో 65-70 ఉండే ఆక్యుపెన్సీ రేటు ప్రస్తుతం 39కి పడిపోయింది. ముఖ్యంగా జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నగరానికి వచ్చే బస్సుల్లో కొన్నిసార్లు పట్టుమని పది మంది ప్రయాణికులు కూడా ఉండట్లేదు.