నర్సును మోసం చేసిన కేటుగాళ్లు.. లాడ్జికి పిలిపించి అసభ్య ప్రవర్తన...
ఎక్కవ వడ్డీ ఇస్తామని ఎవరైనా ఆశజూపినా... లేదా తక్కువ కాలంలోనే రెట్టింపు డబ్బు చెల్లిస్తామని చెప్పినా... గుడ్డిగా నమ్మేసి కష్టార్జితాన్ని సమర్పించేసుకోవద్దు. తీరా డబ్బు వాళ్ల చేతిలో పెట్టాక... రెట్టింపు డబ్బు కాదు కదా ఇచ్చిన డబ్బు కూడా వెనక్కి రాదు. గతంలో ఇలాంటి ఉదంతాలు చాలానే వెలుగుచూశాయి. అయినప్పటికీ ఏదో విధంగా అమాయకులను బుట్టలో వేసుకునే కేటుగాళ్లు ఎక్కువైపోయారు. తాజాగా హైదరాబాద్కి చెందిన ఓ నర్సు కూడా ఇలాగే ఇద్దరు కేటుగాళ్ల చేతిలో మోసపోయింది.
బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం... హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో ఆమె నర్సుగా పనిచేస్తున్నారు. గత ఏడాది ఆమె రాజేశ్,సింహాచలం అనే వ్యక్తులకు రూ.55లక్షలు,రూ.15లక్షలు అప్పుగా ఇచ్చారు. నెల రోజుల్లోనే రెట్టింపు డబ్బు ఇస్తామని చెప్పడంతో ఆమె గుడ్డిగా నమ్మేశారు. అందుకు జామీనుగా ప్లాట్లు కూడా రాసిస్తామని చెప్పడంతో ఆమెకు అనుమానం రాలేదు.
అయితే రోజులు గడుస్తున్నా జామీను ప్రస్తావన లేకపోవడంతో ఆమెలో అనుమానం మొదలైంది.దీంతో డబ్బుల కోసం ఒత్తిడి తీసుకురాగా... రాజేశ్,సింహాచలం ఆమెను శంషాబాద్లోని ఓ లాడ్జికి పిలిపించారు. డబ్బు విషయం మాట్లాడుదామని పిలిచి ఆమెను కత్తితో బెదిరించారు.అంతేకాదు,ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.
తాజాగా రాయదుర్గం పోలీసులను ఆశ్రయించిన ఆ మహిళ ఆరుగురిపై ఫిర్యాదు చేశారు. రెట్టింపు డబ్బు ఆశజూపి తనను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.