స్కూళ్లు ప్రారంభం .. బిల్డింగ్పై నుంచి దూకి పదో తరగతి అమ్మాయి ఆత్మహత్య
హైదరాబాద్ : విద్యా సంవత్సరం ప్రారంభమైందో లేదో అప్పుడే విద్యార్థులు ఆందోళనకు గురువతున్నారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు కానీ .. బలవన్మరణానికి పాల్పడే ధైర్యం చేయడం ఆందోళన కలిగిస్తోంది. పుస్తకాల ఒత్తిడా ? ఇంట్లో సమస్యలా ? వేధింపుల అనే అంశంపై క్లారిటీ లేదు కానీ ... విద్యార్థులు మాత్రం ఒత్తిడికి గురికావడం పేరెంట్స్ను దిగులు కలిగిస్తోంది.
రీ ఓపెన్ ..
తెలంగాణ రాష్ట్రంలో నిన్నటినుంచే పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే మరుసటి రోజు ఎప్పటిలాగే స్కూల్కు వచ్చింది విద్యార్థిని. కానీ స్కూల్ బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చింది. తమ బిడ్డ ఇకలేదని విషయాన్ని ఆ పేరెంట్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు.
దూకిన విద్యార్థిని ...
హైదరాబాద్ హనుమాన్ నగర్కు చెందిన విద్యార్థిని స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. నిన్నటిలాగే .. గురువారం కూడా ఉదయం 8 గంటలకు స్కూల్కు వచ్చింది. కానీ క్లాస్ రూంలో తన బుక్స్, లంచ్ బాక్స్ పెట్టి పైకెళ్లిపోయింది. స్కూల్ బిల్డింగ్ పైకెళ్లిపోయింది. నాలుగో అంతస్తు నుంచి దూకింది. దీంతో తలకు తీవ్రగాయమైంది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. తీవ్రగాయాలతో విద్యార్థిని చనిపోయిందని వైద్యులు తెలిపారు.
కనీస సౌకర్యాలేవీ ..?
విద్యార్థిని మృతికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎల్బీనగర్ ఎస్సై అశోక్ రెడ్డి తెలిపారు. స్కూల్ సమయం కన్నా ముందే విద్యార్థిని వచ్చిందని .. ఆమె చనిపోవడానికి గల కారణం తెలియదని పాఠశాల యాజమాన్య తెలిపింది. ఈ ఘటనపై అన్నికోణాల్లో దర్యాప్తు చేయాలని బాలల హక్కుల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇది హత్య, ఆత్మహత్య అనే అంశాన్ని తేల్చాలని కోరింది. విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా ? ప్రమాదం వల్ల జరిగిందా ? ఇందులో పాఠశాల యాజమాన్యం వైఫల్యం ఎంత ఉందో తెలుపాలని పేర్కొంది. లేదంటే మరికొందరు ఆమెను తోసి ఉండొచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేసింది. అంతేకాదు స్కూల్లో సరైన సౌకర్యాలు కల్పించలేదని విమర్శించింది. ఈ బహుళ అంతస్తు నుంచి చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని భవన సముదాయ యాజమాని బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది.