పీసిసిపై స్పష్టమైన సంకేతాలు.!గేరు మార్చిన రేవంత్ రెడ్డి.!జై కిసాన్..జై జవాన్ నినాదంతో కార్యచరణ.!
హైదరాబాద్ : రైతాంగ, నిరుద్యోగ సమస్యలే ప్రధాన అజెండాగా కాంగ్రెస్ కార్యచరణ ఉంటుందని మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రకటించారు. మారుమూల పల్లెల వరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ప్రధాని మోడీ ప్రజావ్యతిరేక విధానాలను తీసుకువెళతామని ఉద్ఘాటించారు. మోడీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసిసి ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని పాదయాత్రకు శ్రీకారం చుట్టానని తెలిపారు. రైతులు, యువకులు పాదయాత్రకు వేలాదిగా తరలి వచ్చారని, మహిళల స్వాగత సత్కారాలతో నల్ల చట్టాలపై పోరాటం చేసేందుకు వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని రేవంత్ పేర్కొన్నారు.
ముమ్మాటికి అవి నల్ల చట్టాలే.. వాటికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్న రేవంత్..
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీలో తక్షణం తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయం రంగం కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని అంశమని, ఉమ్మడి అంశంపై కేంద్రం చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలా .? వద్దా అనేది ఆ రాష్ట్రం విధానలకే వదిలెయ్యొచ్చని, కానీ మోడీ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టం నిర్భందం కాదు కాబట్టి ఈ చట్టాన్ని అమలు చేయబోమని, తిరస్కరిస్తున్నామని చెప్పే స్వేచ్చ రాష్ట్రానికి ఉన్నా చంద్రశేకర్ రావు ఎందుకు ఆ పని చేయడం లేదని రేవంత్ ప్రశ్నించారు.
మోడీతో కేసీఆర్ చీకటి ఒప్పందం. అందుకే వ్యవసాయ చట్టాలగురించి స్పందించడం లేదన్న రేవంత్ రెడ్డి..
ఇలా కాకుండా చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీకి అమ్ముడు పోయి ఈ చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఆలోచన చేస్తున్నాడని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఈ చట్టాలు అమలు చేసే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవని, గిట్టుబాటు ధర ఉండదని, కంపెనీలు రైతులను మోసం చేస్తే కోర్టుకు వెళ్లడానికి అవకాశం కూడా ఉండదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేసారు. మార్కెట్ కేంద్రాలు, ఎఫ్సిఐ ఎత్తివేసి రైతులను పూర్తిగా బహుళ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. బహుళ జాతికి కంపెనీలకు జరిగిన నష్టాల్లో 10 శాతం భరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్ స్పీచ్లో ప్రకటించిన అంశాన్ని గుర్తు చేసారు.
చట్టంలో సవరణలు చేసుకునే అవకాశం రాష్ట్రానికి ఉంది..కాని కేసీఆర్ అలా చేయడం లేదన్న కాంగ్రెస్ ఎంపీ..
మొదట్లో ఈ చట్టాలను వ్యతిరేకస్తామంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఆ తర్వాత మోడీతో జోడి కట్టాడని విమర్శించారు.కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం లేదని, తక్షణమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటిస్తే సరిపోతుందని సూచించారు. చట్టంలో సవరణలు చేసుకునే అవకాశం రాష్ట్రానికి ఉన్నప్పటికి చంద్రశేఖర్ రావు ఆ దిశగా అడుగులు వేయకపోవడం శోచనీయమన్నారు రేవంత్ రెడ్డి. తాను రైతును అంటూ ప్రచారం చేసుకునే చంద్రశేఖర్ రావు రైతుల వైపు ఎందుకు నిలబడటం లేదని రేవంత్ నిలదీసారు.
పీసిసి ఎవరికో తేలిపోయింది... అందుకే రేవంత్ కు పెరుగుతున్న నేతల మద్దత్తు..
అకతస్మాత్తుగా పాదయాత్రకు రూపకల్పన చేసినప్పటికి రైతాంగం మద్దత్తతో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అండదండలతో విజయవంతం చేసామని రేవంత్ తెలిపారు. అచ్చంపేట నుండి హైదరాబాద్ వరకు 10రోజుల పాటు సాగిన యాత్రలో ప్రజలు ఎంతో సహకరించారని, పార్టీ నాయకులు కూడా తన యాత్రకు మంచి సంఘీబావం ప్రకటిచారని రేవంత్ అభ్రిప్రాయపడ్డారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ పీసిసి అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది కాబట్టి పార్టీ నాయకులు పెద్దఎత్తున రేవంత్ రెడ్డికి మద్దత్తు పలుకుతున్నట్టు తెలుస్తోంది. పీసిసి ఎవరికి దక్కుతుందో స్పష్టమైన సంకేతాలు అందుతున్న తరుణంలో రేవంత్ రెడ్డికి నాయకుల నుండి మంచి ఆదరణ లభిస్తున్నట్టు నిర్దారణ అవుతోంది.