కఠిన నిర్ణయాలు, కీలక మార్పులు.. కేసీఆర్ అభివృద్ధి ఎజెండా..!
హైదరాబాద్ : ప్రజలకు మేలు చేయడమే లక్ష్యం. పాలనలో కీలక మార్పులు, కఠిన నిర్ణయాలు తప్పవు. ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజాకోర్టును మించిన న్యాయస్థానం లేదు. ఇదంతా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు. ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలివ్వలేదని.. ప్రజలకు నూటికి నూరు శాతం మేలు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళుతోందని అన్నారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపడమే తమ ఎజెండా అని చెప్పుకొచ్చారు.
సంక్షేమం.. అభివృద్ధి మంత్రం
కోటి ఆశలతో సాధించుకున్న తెలంగాణను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. సోమవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడిన ముఖ్యమంత్రి.. పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రం సిద్ధించాక ఏర్పడ్డ తొలి తెలంగాణ ప్రభుత్వంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టినట్లు వివరించారు.
ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వకపోవడమే గాకుండా, అసత్య ప్రచారం చేయడంలో ముందున్నారని ఆరోపించారు. అసలు వారికి బడ్జెట్ అర్థం కాలేదనే సందేహం వ్యక్తమవుతోందని అభిప్రాయపడ్డారు. ఎవరైనా సరే సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడితే సహించబోమన్నారు. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమైనవని నిరూపించేలా.. టీఆర్ఎస్ విధానాలకే ప్రజలు మొగ్గుచూపి మరోసారి పట్టం కట్టారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాకోర్టును మించిన న్యాయస్థానం లేదని అభిప్రాయపడ్డారు.
ఎలా చూసినా నంబర్ వనే
తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకెళుతోందని చెప్పిన కేసీఆర్.. దేశవ్యాప్తంగా అనేక అంశాల్లో నెంబర్ వన్ గా ఉందన్నారు. వృద్ధిరేటులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సాక్షాత్తు కాగ్, కేంద్ర ఆర్థికశాఖలే చెబుతున్నాయి. తలసరి విద్యుత్ వినియోగంలోనూ, అభివృద్ధిలోనూ, సంక్షేమంలోనూ మన రాష్ట్రమే ముందుందని చెప్పుకొచ్చారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన తెలంగాణనే అని అన్నారు. సోలార్ పవర్ ప్రొడక్షన్ ను కూడా 5వేల మెగావాట్లకు పెంచుతామన్నారు. ఎన్నికల మేనిఫెస్టో హమీ ప్రకారం నిరుద్యోగ భృతి నాలుగైదు నెలల్లో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో అర్హులను గుర్తించి సాధ్యమైనంత త్వరగా నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
వ్యవసాయం, విద్య.. పెద్దపీట
రాష్ట్ర ప్రజలకు మేలైన పాలన అందించడానికి కఠిన నిర్ణయాలు, కీలక మార్పులు తప్పవన్నారు కేసీఆర్. అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందిస్తామన్నారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖకు ప్రజలు ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భూరికార్డులకు లెక్కాపత్రం లేదు. ఈ ప్రభుత్వంలో మరో ఏడాదిలోగా నూటికి నూరు శాతం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తిచేస్తామని చెప్పారు. సర్వేకు అవసరమైన నిధులు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తుందని, వాటిని వినియోగించుకుంటామని తెలిపారు.
విద్యారంగం కోసం 6 శాతం నిధులు కేటాయించామని ప్రతిపక్షాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. విద్యరంగానికి వివిధ పద్దుల కింద మొత్తం 19 వేల 482 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఓవరాల్ గా ఇది 11.2 శాతమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులను కూడా పెంచామన్న కేసీఆర్.. 2004 నుంచి కాంగ్రెస్ పాలనలో 10.99 శాతం మాత్రమే ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అందుకే..!
వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు కేసీఆర్. మార్కెట్ కమిటీల్లో 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీ సొంతమని చెప్పారు. ఒకప్పుడు రాష్ట్రంలో 19 బీసీ గురుకులాలు ఉంటే.. 280 గురుకులాలకు పెంచింది మా ప్రభుత్వమేనని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో మాత్రమే బీడీ కార్మికులకు పింఛను అమలు చేస్తున్నామని వివరించారు. సరిహద్దుల్లోని అటవీభూముల వివాదాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి కొలిక్కి తెస్తామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడంతోనే.. ఇక్కడ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాల్సి వచ్చిందన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెసోళ్లు జీఎస్టీ ఎత్తివేస్తామంటున్నారు.. ఎన్డీయే ప్రభుత్వమేమో మోడల్ స్కూళ్లను ఎత్తివేస్తామంటోంది. అందుకే అధికారంలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు ఎలా ఉంటాయో స్పష్టత లేకపోవడంతోనే తాము కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కే మొగ్గు చూపాల్సి వచ్చిందన్నారు.