సీఎం కేసీఆర్, గవర్నర్, ప్రముఖుల పేరిట పార్శిళ్లు.. రసాయన బాంబులా.. టెన్షన్ టెన్షన్, చివరకు..!
హైదరాబాద్ : భాగ్యనగరంలో మంగళవారం నాడు సోషల్ మీడియాలో వచ్చిన ఓ మేసేజ్ కలకలం రేపింది. ప్రముఖుల పేరుతో వచ్చిన పార్శిళ్లు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవైకి పైగా పెట్టెలు పోస్టాఫీసులో దర్శనమివ్వడంతో కంగుతిన్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ సహా పలువురి ప్రముఖుల పేర్లు పార్శిళ్లపై కనిపించడం.. అంత పెద్దమొత్తంలో పెట్టెలు రావడం అధికారులను టెన్షన్కు గురిచేసింది. రసాయన బాంబులంటూ అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.
ఆ పార్శిళ్లతో ఉరుకులు పరుగులు.. టెన్షన్ టెన్షన్..!
సికింద్రాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీసులో ప్రముఖుల పేర్లతో పార్శిళ్లు వచ్చాయనే ప్రచారం మంగళవారం నాడు టెన్షన్ క్రియేట్ చేసింది. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత.. డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్తో పాటు మరో ఐదుగురు డీసీపీల పేరిట ఈ పార్శిళ్లు బుక్ చేయడం అనుమానాలకు తావిచ్చింది. దాదాపు 60కి పైగా ఉన్న పార్శిళ్లు చూసి పోస్ట్ ఆఫీస్ సిబ్బంది కంగుతిన్నారు. ఈ పెట్టెలను ఈ నెల 17వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు.
17వ తేదీన ఓయూ క్యాంపస్ పోస్ట్ ఆఫీసులో బుక్ చేసిన ఈ పార్శిళ్లు 20వ తేదీ సోమవారం నాటికి బట్వాడా చేసే క్రమంలో సికింద్రాబాద్ పోస్ట్ ఆఫీసుకు చేరుకున్నాయి. అయితే ఇంత పెద్దమొత్తంలో బాక్సులు రావడం చూసి అక్కడి సిబ్బంది అవాక్కయ్యారు. అంతేకాదు వాటి మీద డెలివరీకి సంబంధించి అంతా ప్రముఖుల పేర్లే ఉండటం చూసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
నడ్డా - కేటీఆర్, మధ్యలో రాములమ్మ.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలేంటి..!
పార్శిళ్లపై సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల పేర్లు
పార్శిళ్లు అన్నీ ఒకేరకంగా ఉండటంతో అప్రమత్తమైన సికింద్రాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది జాగ్రత్తగా పరిశీలించడంతో గుట్టురట్టైంది. వాటిపై ప్రముఖుల పేర్లు చూసి కంగుతిన్నారు. అయితే వాటి నుంచి దుర్వాసన రావడం, అనుమానస్పదంగా ఉండటంతో పోస్టల్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. అదలావుంటే ఆ పెట్టెలను ఓపెన్ చూస్తే వాటిలో కొన్ని సీసాలు కనిపించాయి. వాటిలో కెమికల్స్ లాగా ఉన్న లిక్విడ్ కనిపించడంతో మరింత షాక్ తిన్నారు. ఒక్కో సీసాలో దాదాపు లీటర్ నుంచి లీటరున్నర దాకా పరిమాణంలో లిక్విడ్ ఉంది.
రసాయన బాంబులేమోనన్న కోణంలో తొలుత అనుమానించినప్పటికీ.. చివరకు పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలుగా క్లూస్ బృందం గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే వాటిలో పేలుడు పదార్థాల లాంటివి ఏమైనా ఉన్నాయా లేదంటే విష పదార్థాలున్నాయా అనే విషయాన్ని ధృవీకరించడానికి పోలీసాధికారులు ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు.
కొందర్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు..!
ఆ పార్శిళ్లల్లో పెట్టెలతో పాటు ఏవో లెటర్లు ఉన్నట్లు కూడా గుర్తించారు పోలీసులు. అయితే ఆ లేఖల్లో స్పష్టత కొరవడిందని చెబుతున్నారు. ఆ పార్శిళ్లు ఎవరైతే పంపారో.. కలుషిత నీళ్లతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం చెప్పాలనుకునే తీరుగా ఈ వ్యవహారం ఉందంటున్నారు పోలీసులు. ఓయూ క్యాంపస్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఇలా చేసి ఉంటారనేది పోలీసుల అంచనా. అలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఇలాంటి వ్యూహం పాటించి ఉంటారని భావిస్తున్నారు. అయితే పోస్టల్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్రమంలో పార్శిళ్లు పంపించారని భావిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
కలుషిత నీరేనా.. అనుమానాలెన్నో..!
జమ్ముకశ్మీర్ విభజన బిల్లు, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంతో పాటు వినాయకచవితి పండుగ సమీపిస్తున్న తరుణంలో ప్రముఖుల పేర్లతో దర్శనమిచ్చిన ఈ పార్శిళ్లు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. అసాంఘిక శక్తులు ఇలాంటి ఎత్తుగడకు పాల్పడ్డారేమోనన్న టెన్షన్కు గురయినట్లు తెలుస్తోంది. చివరకు అలాంటిదేమీ లేదని తేల్చడంతో రిలాక్సయినట్లు సమాచారం. అదలావుంటే ఆ పార్శిళ్లలో కలుషిత నీరు ఉన్నట్లు పోస్టల్ అధికారులు, పోలీసులు చెబుతున్నప్పటికీ.. డీజీపీ, సీపీ, ఐదుగురు డీసీపీలకు ఆ బాక్సులు ఎందుకు పంపించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ నిజంగా కలుషిత నీరు ఉంటే గనక.. పోలీస్ అధికారులకు పంపించాల్సిన అవసరమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తానికి ఫోరెన్సిక్ నివేదిక వస్తే గానీ అసలు నిజాలేంటో తెలిసేటట్లు లేదు.