వీఆర్ఏలకు కేసీఆర్ తీపి కబురు.... ఎవరైనా ఉద్యోగ విరమణ చేస్తే....
వీఆర్ఏ(గ్రామ రెవెన్యూ సహాయకులు)లకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా శుభవార్త చెప్పారు. చెప్పినట్లుగానే వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకటించారు. అంతేకాదు,ఎవరైనా పదవీ విరమణ కోరితే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలు అందిస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకుని... మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం(సెప్టెంబర్ 11) కొత్త రెవెన్యూ చట్టంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్ఏల సేవలను విస్మరించలేమని.... వీళ్లలో ఎక్కువమంది బడుగు,బలహీనవర్గాలకు చెందినవారేనని చెప్పారు. వీఆర్ఏలు ఎవరైనా ఉద్యోగ విరమణ చేస్తే... వారి స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఇందులో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. వీఆర్ఏ సమస్యలపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా కేసీఆర్ ఇలా స్పందించారు.
రెవెన్యూ శాఖ సేవలను కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కొనియాడటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ దీనిపై సంతోషం వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని పేర్కొంది.
కాగా,శుక్రవారం(సెప్టెంబర్ 11) తెలంగాణ అసెంబ్లీ కొత్త రెవెన్యూ చట్టం 2020కి ఆమోద ముద్ర వేసింది. భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ చట్టంపై రెండు రోజుల పాటు అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చట్టం ప్రకారం ఇకపై వీఆర్వో వ్యవస్థ శాశ్వతంగా రద్దు కానుంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారాలు ఎమ్మార్వోలే చూస్తారు. ఒకేసారి రిజిస్ట్రేషన్,మ్యుటేషన్ ప్రక్రియ ఉంటుంది. ధరణి పోర్టల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.