సమ్మె కాలానికి జీతం ఇస్తాం: పదవీ విరమణ వయసు 60కి పెంపు : ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు..!
తెలంగాణ ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మికులు..యూనియర్ల పైన కఠినంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి కేసీఆర్..ఇప్పుడు వరాలు ప్రకటించారు. తెలంగాణలోని మొత్తం 97 డిపోల నుండి వచ్చిన ఆర్టీసీ కార్మికులతో సమావేశమైన ముఖ్యమంత్రి వారితో కలిసి లంచ్ చేసారు. ఆర్టీసీ స్థితిగతులను వివరించారు. తాను ప్రతిపాదించిన రూట్ల ప్రైవేటీకరణ గురించి వివరించారు. ఆర్టీసీలో పాత బస్సుల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు పైన హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కార్మికులు తమ వేతనాలు కోసం లేబర్ కోర్టులో పోరాడక తప్పదని భావిస్తున్న వేళ..కార్మికులు అడిగిన వెంటనే ఖచ్చితంగా 52 రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. అదే విధంగా ఉద్యోగుల వయో పరిమితిని 60 ఏళ్లకు పెంచుతామన్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తే సింగరేని తరహాలో బోనస్ ఇస్తామని స్పష్టం చేసారు. ఇక, మహిళా కార్మికులకు ప్రత్యేక వసతుల కల్పన పైనా సీఎం హామీ ఇచ్చారు.
ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి తొలగిస్తే ఇబ్బందులు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, అందుకే కేసీఆర్: జీవన్
52 రోజుల సమ్మె కాలానికి వేతనం..
ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె సమయంలో అసలు సమ్మె చట్ట విరుద్దమని..వారికి సెప్టెంబర్ వేతనాలు చెల్లించటానికే తమ వద్ద నిధులు లేవని చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి ఒక్కసారిగా వారి పైన ఔదార్యం చాటుకున్నారు. కార్మికులతో సమావేశమై వారితో మనసు విప్పి మాట్లాడిన కేసీఆర్..ఆర్టీసీ భవిష్యత్ గురించి తన ప్రణాళికలను వివరించారు. అందులో భాగంగా కార్మికులు కోరటంతో..సమ్మె చేసిన 52 రోజులకు వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. అదే సమయంలో పెండింగ్ లో ఉన్న సెప్టెంబర్ జీతాన్ని సోమవారం విడుదల చేస్తామని స్పష్టం చేసారు. అదే విధంగా కార్మికులకు సంబంధించిన ఆరోగ్య భీమా..ఈఎస్ఐ కు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని..అయితే కొంత సమయం పడుతుందని వివరించారు. సమ్మె కాలానికి జీతాలు మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇస్తామని స్పష్టం చేసారు.
పదవీ విరమణ వయసు 60కి పెంపు
ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో కాలంగా కోరుతున్న విధంగా ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసును 60కి పెంచుతూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అదే సమయంలో మహిళా కార్మికుల సమస్యల పైన ప్రత్యేకంగా చర్చించారు. ఇక నుండి మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు అమలు చేస్తామన్నారు. దీంతో పాటుగా రాత్రి 8 గంటల తరువాత మహిళా కార్మికులకు డ్యూటీలు ఉండవని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లోని సభ్యులకు సైతం బస్ పాస్ లు..ఆరోగ్య సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు చెకింగ్ సమయంలో టిక్కెట్లు ప్రయాణీకుల వద్ద లేకపోతే కండెక్టర్లకు జరిమానా విధిస్తున్నారని..ఇక నుండి ప్రయాణీకుల నుండే జరిమానా వసూలు చేస్తామని హామీ ఇచ్చారు.
సమ్మె కాలంలో మరణించిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు
ఆర్టీసీ సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని కేసీఆర్ ప్రకటించారు. వారి కుటుంబాల్లో అర్హత ఉన్న వారికి వీలైతే ఆర్టీసీలో లేకుంటే ప్రభుత్వం లో ఉద్యోగం ఇస్తామని స్పష్టం చేసారు. ఇక ఆర్టీసీని ఎలా నడిపించాలో తనకు తెలుసంటూనే..తాను చెప్పినట్లుగా వింటే ఖచ్చితంగా లాభాల బాట పట్టిస్తానని ప్రకటించారు. ఆర్టీసీ లాభాల్లోకి వస్తే..సింగరేణి తరహాలో కార్మికులకు బోనస్ ఇస్తామని మరోసారి కార్మికులకు హామీ ఇచ్చారు. ఏ కార్మికుడు యూనియన్ల వద్దకు వెళ్లవద్దని..వారిని ప్రోత్సహించవద్దని కోరారు. కార్మికుల సంక్షేమ బాధ్యత తనదేనని సీఎం స్పస్టం చేసారు. తమతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసి..తమ సమస్యలు వినటంతో పాటుగా అమలు దిశగా నిర్ణయం తీసుకోవటం పైన కార్మికులు ముఖ్యమంత్రిని ప్రశంసలతో ముంచెత్తారు.