ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ అపర చాణిక్యం... ఒకవైపు చర్చలు.. మరోవైపు సమ్మె విచ్చిన్నానికి యత్నం
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మె విషయంలో అపర చాణిక్యం ప్రదర్శిస్తున్నారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆర్టీసీ కార్మిక సమ్మెపై హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర వ్యాఖ్యలు చేసిన కెసిఆర్ మొత్తానికి కార్మికులతో చర్చల విషయంలో సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. నేడు కార్మిక సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించడంతో రాష్ట్ర ప్రభుత్వం కొంత మెత్తబడ్డట్టుగానే కనిపిస్తోంది. ఒక పక్క చర్చలు అంటూనే మరోపక్క సమ్మె విరమింపజేసే యత్నం చేస్తున్నారు కేసీఆర్.
నేడు కార్మిక సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు
ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్షలో త్వరలో కోర్టుకు వినిపించాల్సిన వాదనలతోపాటు, సమ్మెను ఆపేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి పువ్వాడ అజయ్, అధికారులతో చర్చలు జరిపారు. ఆర్టీసీ కార్మికులను నేడు చర్చలకు ఆహ్వానించి మాట్లాడనున్నారు. మొన్నటికి మొన్న చర్చల ప్రసక్తే లేదనీ, ఆర్టీసీ మునిగిపోవడమే సమ్మెకు ముగింపు అన్నట్టుగా ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేసి ఇప్పుడు చర్చలకు పిలవడం వెనుక ఆంతర్యం ఈనెల 28న కోర్టుకు సమ్మెను ఆపేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా చర్చలకు పిలిచామని చెప్పడమే అని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ప్రభుత్వ నిర్ణయాలు మాత్రమే అంగీకరింపజేసే యత్నం అని చర్చ
నేడు చర్చలో భాగంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం తాము తీసుకున్న నిర్ణయాన్ని కార్మికులతో తేల్చిచెప్పనుంది. కార్మికుల డిమాండ్స్ పై సాధ్యాసాధ్యాలను మాట్లాడనుంది. విలీనం విషయాన్ని పక్కన పెట్టి మిగతా అంశాలపై మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఆర్టీసీ కార్మిక నాయకులు ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్స్ కు సరే అంటే ఓకే కానీ నో అంటే ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు చర్చలకు పిలిచినప్పటికీ సమ్మెను నిర్మూలించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.
సమ్మె విరమకు కేసీఆర్ వ్యూహం .. రంగంలోకి ఎమ్మెల్యేలు
కార్మికులతో, కార్మిక సంఘ నాయకులతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి సమ్మె విరమింపచేయడానికి నేరుగా వారితో మాట్లాడాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే మౌఖికంగా సూచించారని టాక్ వినిపిస్తుంది. ఇక విధుల్లో చేరాలని అనుకునేవారు కూడా సమ్మె విరమిస్తున్నట్లు లిఖితపూర్వకంగా రాసిచ్చి విధుల్లో చేరాలని కూడా ఆయన పేర్కొన్నారు. విధుల్లో చేరేందుకు కార్మికుల్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కార్మిక సంఘాల నాయకులను తిడుతూ కార్మికుల పట్ల తన సానుభూతిని తెలియజేస్తున్నారు.
కార్మిక సంఘాల నేతలపై ఒత్తిడితో కార్మికులను మార్చే ప్లాన్
ఇక సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో కూకట్ పల్లి డిపోలో రాజు అనే డ్రైవర్ 21 రోజుల సమ్మె తరువాత ప్రప్రథమంగా ముందుకొచ్చి, డిపో మేనేజర్ కి లేఖ ఇచ్చి విధుల్లో చేరారు. అతనే అశ్వద్ధామ రెడ్డి మీద కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, కార్మికులను రెచ్చగొడుతున్నారని, అశ్వద్ధామ రెడ్డి వంటి నేతల వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఒక్క కూకట్ పల్లిలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులూ, కార్మికులను విధులకు హాజరయ్యేట్టు చేయడం వంటి ప్రయత్నాల ద్వారా సమ్మెను విరమింపజేయాలనే వ్యూహం సైతం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు.
కోర్టుకు సమాధానం చెప్పేందుకే చర్చలని రాజకీయవర్గాల్లో చర్చ
చర్చల్లేవు అంటూ తేల్చేసిన కేసీఆర్ ఇప్పుడు చర్చలకు వెళ్లడం, మరొక వైపు ఆర్టీసీ సమ్మె ను అణిచివేయడం కోసం బహుముఖ వ్యూహాలను అమలు చేయడం చూస్తుంటే కెసిఆర్ అపర చాణిక్యం ఇట్టే అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకుల భావన. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి తప్పు లేకుండా చూసుకునేందుకు, కోర్టుకు సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేస్తూనే, తాను అనుకున్నది మాత్రమే చేయడంలో తన రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తున్నారు సీఎం కేసీఆర్.