కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అంతా సిద్ధం, కానీ, ప్రభావం ఎలా ఉంటుందో?: మోడీతో మీట్లో కేసీఆర్
హైదరాబాద్: శాస్త్రీయంగా ఆమోదం పొందిన కరోనా వ్యాక్సిన్ను ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఆత్రుతగా..
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉంటుందో..?
ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు వ్యాక్సిన్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, కరోనావైరస్ కూడా దేశమంతా ఒకే రకమైన ప్రభావాన్ని చూపలేదన్నారు.
ఈ కారణంగా వ్యాక్సిన్ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

వ్యాక్సిన్పై కేసీఆర్ సూచన్
అందుకే మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి వాటిని కొంతమంది ఇవ్వాలని, ఆ తర్వాత 15 రోజులు పరిస్థితిని పరిశీలించి మిగితా వారికి ఇవ్వాలని సూచించారు. కాగా, వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్ర వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని, ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేయండి..
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ను సరఫరా చేసేందుకు అవసరమైన కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. మొదట ఆరోగ్య కార్యకర్తలకు, కోవిడ్పై ముందుండి పోరాడుతున్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి, అరవై ఏళ్ళు దాటిన వారికి, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. దీని కోసం జాబితాను రూపొందించాలని ఆదేశించారు.