ఆ ఎమ్మెల్యేలు కారెక్కడం కరెక్టే.. అసెంబ్లీలో కేసీఆర్ ఏమన్నారంటే..!
Recommended Video
హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ దూకుడును తట్టుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. టీడీపీ సహా ఇతర పార్టీలతో జట్టుకట్టి మహాకూటమిగా ఏర్పడ్డ కూడా రాజకీయ చదరంగంలో హస్తం పాచికలు పారలేదు. దాంతో 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేవలం 19 సెగ్మెంట్లలోనే విజయం సాధించింది. అయితే అందులో 12 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కారెక్కేశారు.
ఆ క్రమంలో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది గులాబీగూటికి చేరితే ఇక మిగిలింది ఏడుగురే. టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కోవడానికి ఈ సంఖ్యాబలం ఎక్కడ సరిపోతుందనే వాదనలున్నాయి. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్ కావడానికి ఆ పార్టీ విధానాలే తప్పని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించడం చర్చానీయాంశమైంది.
పార్టీ ఫిరాయిపుంలపై కాంగ్రెస్ గుస్సా..!
టీఆర్ఎస్ విధానాలు, సీఎం కేసీఆర్ పోకడలు అనుసరణీయం కావని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర్నుంచి గులాబీగూటిపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో హస్తం గుర్తుపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా కారెక్కించి పన్నెండు మందికి గులాబీ తీర్థం పోశారు. ఇక అప్పటినుంచి టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్పై కాంగ్రెస్ లీడర్లు రెచ్చిపోతూనే ఉన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం కేసీఆర్ అవివేకమని ఫైరవుతున్నారు. అది మంచి సంప్రదాయం కాదని హితవు పలుకుతున్నారు. అపొజిషన్ లీడర్ల గొంతు నొక్కి ప్రజా సమస్యలు బయటకు రాకుండా అరాచక పాలనకు పరాకాష్టలా కేసీఆర్ నిలిచారని ఫైరవుతున్నారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం సరికాదని.. కేసీఆర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని న్యాయపోరాటానికి సైతం సిద్ధమయ్యారు.
కారు వర్సెస్ కమలం.. వరంగల్ ఖిల్లాపై కన్ను..! తెలంగాణలో పట్టు దొరికేనా?
రాజ్యాంగ నిబంధనల ప్రకారమే విలీనం..!
అదలావుంటే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాట్లాడిన కేసీఆర్.. రాజ్యాంగ నిబంధనల ప్రకారమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం అయ్యారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పార్టీ ఫిరాయింపుల అంశం లెవనెత్తి తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసిన అంశం ప్రస్తావించారు. దానిపై స్పందించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఆ అంశం కోర్టులో ఉన్నందున చర్చించడానికి వీల్లేదన్నారు.
ఎమ్మెల్యేలను కాపాడుకోలేదు.. అది మీ తప్పే..!
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదని గుర్తు చేశారు. కర్ణాటక, గోవాలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని వెల్లడించారు. ఏపీలో కూడా టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరిన సందర్భముందని తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని.. దానికి ఎవరేం చేస్తారని ప్రశ్నించారు.
ముందస్తు ఎన్నికల వేళ కూడా కాంగ్రెస్ ఎన్ని హామీలు గుప్పించినా ప్రజలు నమ్మలేదన్నారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయినందుకే ఆ పార్టీకి అపజయం ఎదురైందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ను నిందించడం ఎందుకన్నారు. 1/3వ వంతు సభ్యులు విలీన లేఖ ఇచ్చిన తర్వాత అది చట్టవిరుద్ధం కాదని స్పష్టం చేశారు.