యురేనియం తవ్వకాలకు నో పర్మిషన్.. మిషన్ భగీరథ సక్సెస్, రైతులకు అండగా.. అసెంబ్లీలో కేసీఆర్
హైదరాబాద్ : యురేనియం తవ్వకాలకు పర్మిషన్ ఇవ్వలేదని.. భవిష్యత్తులో కూడా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్లమల అడవులను నాశనం కానివ్వబోమంటూ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన కేసీఆర్.. యురేనియం తవ్వకాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వడం కొసమెరుపు. మిషన్ భగీరథ పథకం విజయవంతం అయిందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు.
యురేనియం తవ్వకాలపై ఆందోళన వద్దు : కేసీఆర్
యురేనియం తవ్వకాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత యురేనియం మైనింగ్పై ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా అనుమతి ఇచ్చే ఆలోచన లేదన్నారు. ఏది ఏమైనా నల్లమల అడవులు నాశనం కాకుండా చూస్తామన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని చెప్పినా కూడా పర్మిషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో 2009వ సంవత్సరంలోనే అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో తవ్వకాలు ప్రారంభమయ్యాయని.. దానివల్ల శ్రీశైలం, పులిచింత, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కింద డెల్టా ప్రాంతం కలుషితమయ్యే పరిస్థితి ఉందన్నారు. దాంతో హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు కూడా తీసుకోలేని ప్రమాదం పొంచి ఉందన్నారు.
హుజుర్నగర్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి డిక్లేర్.. టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవితనా?
మిషన్ భగీరథ సక్సెస్.. ప్రతి రోజు 54 ఇళ్లకు నీళ్లు
మిషన్ భగీరథ తాగునీటి పథకం విజయవంతం అయిందన్నారు కేసీఆర్. హైదరాబాద్లో కాస్ట్లీ ప్రాంతాలైన బంజారాహిల్స్ లాంటి కాలనీ వాసులు ఎలాంటి నీళ్లు తాగుతున్నారో మారుమూల ప్రాంత వాసులు కూడా అవే నీళ్లు తాగుతున్నారంటే ఆ క్రెడిటంతా మిషన్ భగీరథ పథకానిదేనని చెప్పుకొచ్చారు. ప్రతి రోజు 54 లక్షల గడపలకు భగీరథ వాటర్ అందుతోందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నల్గొండ ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డారని.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 35 వేల పైచిలుకు వాటర్ ట్యాంకులు కట్టినట్లు చెప్పుకొచ్చారు. మిషన్ భగీరథ పథకం చాలా బాగుందని కేంద్ర అధ్యయన సంస్థలు రాష్ట్రానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నాయని చెప్పారు. మిషన్ భగీరథ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జల్ శక్తి అభియాన్ అని పేరు పెట్టుకోవడం ఆ పథకం పనితీరుకు నిదర్శనమన్నారు.
రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నాం : కేసీఆర్
తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులకు అతీతంగా రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు కేసీఆర్. ఇదివరకు రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. గుంట భూమి ఉన్నా సరే ఆ రైతు చనిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం పది రోజుల్లో 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అన్నదాతలకు అండగా ఉంటామని.. వ్యవసాయానికి ఫ్రీ కరెంటుతో పాటు రైతు బీమా, రైతు బంధు పథకాలు కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. రైతులను రుణ విముక్తులుగా చేయడమే లక్ష్యంగా నిధులు కూడా కేటాయించామని తెలిపారు.