లక్షకు పైగా ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం.. ప్రతిపక్షాల కేసుల వల్లే ఆలస్యం.. బడ్జెట్పై సీఎం వివరణ..!
హైదరాబాద్ : అసెంబ్లీలో బడ్జెట్పై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్ సవివరంగా సమాధానాలు ఇచ్చారు. ఆర్థిక నిపుణులను సంప్రదించిన తర్వాతే సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టామని తెలిపారు. బడ్జెట్పై భేషజాలకు పోలేదని గుర్తు చేశారు. రుణాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ పాలన జపాన్, చైనా, అమెరికా లాంటిదని చెప్పుకొచ్చారు. అత్యధిక అప్పులున్న జపాన్ ప్రపంచాన్ని శాసిస్తోందన్నారు. దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొందని సాక్షాత్తూ నిపుణులే చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ అందరికీ తెలిసిందే కదా..!
ఆర్థిక మాంద్యం ప్రభావం అన్ని రంగాలపై పడిందన్న కేసీఆర్.. ఆర్థిక మాంద్యంతో దేశంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన అందరిలో నెలకొందన్నారు. ఆర్థిక మాంద్యం ఏయే రంగాలపై ఉందో స్పష్టంగా చెప్పలేమన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని.. మూడేళ్ల వరకు తేరుకోలేమని నిపుణులు చెబుతున్నారని గుర్తు చేశారు. విపక్ష నేతలు బడ్జెట్పై పెదవి విరవడం సరికాదన్నారు.
కేసీఆర్ కుటుంబ పాలన.. బీజేపీ డోర్లు తెరిస్తే టీఆర్ఎస్ ఎంపీలు కారులో ఉంటారా? : రఘునందన్
తెలంగాణ అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించింది : కేసీఆర్
తెలంగాణ అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించిందన్న కేసీఆర్.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ అభివృద్ధి సాధించామన్నారు. తాను కథలు చెప్పడం లేదని.. ఇదంతా కూడా ఆర్థిక సంస్థలు చెబుతున్న మాటే కదా అన్నారు. ఆర్థిక మాంద్యంపై నిత్యం దినపత్రికల్లో కథనాలు వస్తూనే ఉన్నాయి కదా అన్నారు. తలతోక లేకుండా కొందరు మాట్లాడుతుంటే బాధగా ఉంది.. కాంగ్రెస్ నేతలు 1940లోనే ఉంటున్నారు. ముందుకేసి చూడటం లేదని ఎద్దేవా చేశారు.
ఇంకా కేసీఆర్ ఏమన్నారంటే..!
తెలంగాణ మీద అప్పుల భార పడుతోందని కొందరు మాట్లాడుతున్నారు. అప్పులు తేవడం తప్పా.. తెచ్చిన అప్పులు ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతున్నాం. అది తప్పా. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులు కాలు మీద కాలు వేసుకుని కూర్చునే రోజు వస్తుంది. అలా అభివృద్ది దిశగా అడుగులు వేయడం తప్పా. కాంగ్రెస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారు. తెలిసి మాట్లాడుతున్నారా లేదంటే తెలియక మాట్లాడుతున్నారో వారికే ఎరుక.
మూలధనం వ్యయం విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు మెచ్చుకుంది. తెలంగాణ ప్రభుత్వం తప్పులు చేయడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం లేదు. అప్పుల గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు బాధ పడాల్సిన అవసరం లేదు. తెచ్చిన అప్పులకు భవిష్యత్తులో తప్పకుండా ప్రతి ఫలాలు వస్తాయి. అది అందరూ చూస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరికీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందన్నది తెలుస్తుంది. అప్పుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటన్నది ఒక్క ఏడాదిలోగా తెలుస్తాయని అన్నారు. అంతవరకు ఓపిక పట్టాలే గానీ.. విపక్ష నేతలు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదన్నారు.
లక్షకు పైగా ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం.. ప్రతిపక్షాల కేసుల వల్లే ఆలస్యం
తెలంగాణ ప్రభుత్వం ఏ విషయంలో తొందరపడటం లేదని స్పష్టం చేశారు కేసీఆర్. కాస్త ముందు వెనకా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పాలన సాగిస్తున్నామన్నారు. పేదలకు ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని.. క్రమ పద్దతిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. లక్షకు పైగా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్న కేసీఆర్.. ప్రతిపక్షాల కేసుల వల్లే నియామక ప్రక్రియ ఆలస్యం అవుతోందన్నారు.