ముందస్తు ఎన్నికలు తథ్యం, కేసీఆర్ ఎన్నికకు వెళతారు: ప్రవీణ్ కుమార్
తెలంగాణలో ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. అయినప్పటికీ రాజకీయం మాత్రం వేడెక్కింది. ఎన్నికల కసరత్తులో ప్రధాన పార్టీలు ఉన్నాయి. మునుగోడు బై పోల్ తర్వాత అధికార పార్టీలో జోష్ ఉంది. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ఒకరు.. వెళ్లరని మరొకరు కామెంట్ చేస్తున్నారు. వారి బాటలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 6 నెలల్లో ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ వెళతారని చెప్పారు. ఈడీ, ఐటీ సోదాలు టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలని ఆయన విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫారెస్ట్ అధికారి హత్యకు గురి కావడానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పారు.
52 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను కల్పిస్తే ఎలాగని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 26వ తేదీ నుంచి పెద్ద ఎత్తున పోరాడుతామని చెప్పారు. కోటి సంతకాలను సేకరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిస్తారని అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో విజయం తమదంటే తమదని అంతా అనుకుంటున్నారు. అవును విజయం తథ్యం అని ధీమాతో ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. కాంగ్రెస్ కూడా తాము బరిలో ఉన్నామని అంటోంది.