లాభసాటిగా వ్యవసాయం.. గతంలో పాన్ డబ్బా పెట్టుకోవడమే నయం అనేవారు.. సీఎం కేసీఆర్
వ్యవసాయం లాభసాటిగా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో పరిస్ధితులు మాత్రం భిన్నంగా ఉండేవన్నారు. వ్యవసాయం చేయడం కన్నా పాన్ డబ్బతాపెట్టుకోవడం నయమని అభిప్రాయపడే వారన్నారు. కానీ పరిస్థితి మారిందని చెప్పారు. మంగళవారం వ్యవసాయంపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతు బంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు సమీక్షకు హాజరయ్యారు.
గాలిలో దీపం పెట్టి..
ఇదివరకు వ్యవసాయం గాలికి దీపం పెట్టి దేవుడా దిక్కు అనే రీతిలో సాగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పట్ల ఉన్న అభిప్రాయాలను స్వయం పాలనలో తిరగరాసిందని పేర్కొన్నారు. తెలంగాణలో అమలు చేస్తోన్న రైతు సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలనే కాక కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేశాయన్నారు. రైతు బంధు పథకాన్ని ఒడిశాలో కాలియా పేరుతో అమలు చేస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తనముందే మీడియాకు చెప్పారని వెల్లడించారు.
ఆదర్శం..
కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి కూడా రైతు బంధు పథకమే స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. రైతు బీమా పథకం ప్రపంచంలో మరెక్కడా అమలులో లేదన్నారు. తెలంగాణ వ్యవసాయం దేశానికి ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర విభజన సమయానికి 4 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కల గోదాములను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డాక 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచడం మామూలు విషయం కాదన్నారు.
సాగునీరు..
రైతులకు సకాలంలో పంట పెట్టుబడి, నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్, కాళేశ్వరం ఇతర ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతోందన్నారు. పాలమూరు జిల్లా వ్యవసాయం అభివృద్ధి చెందడం తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి నిదర్శనం అన్నారు. వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ, అటవీ ప్రాంతం విస్తరణతో అత్యధిక వర్షపాతం పొందుతున్న జిల్లాగా ఉందన్నారు.