ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్...
ఆర్టీసీ సంస్థ భవితవ్యం...కార్మికుల సంక్షేమం.... రెండింటీ భవిష్యత్ తేల్చేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. ఆర్టీసీ సమ్మెకు ప్రధాన కారణం యూనియన్లని భావిస్తున్న సీఎం నేరుగా కార్మికులతోనే సమావేశం అయ్యెందుకు నిర్ణయించారు. ఈనేపథ్యంలోనే ఆదివారం ఉదయం ప్రగతిభవన్లో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు.. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి డిపో నుండి అయిదుగురు ఉద్యోగులకు ఆహ్వానం పంపారు. వారితో పలు అంశాలను చర్చించిన అనంతరం కార్మికులతో కలిసి భోజనం కూడ చేయనున్నారు.
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ కరుణ, కుటుంబాలపై కూడా, ఉద్యోగం ఇస్తామని వరం, హర్షం
కార్మికులతో నేరుగా సీఎం సమావేశం
ఆర్టీసీ సమ్మె ప్రభావంతో సీఎం కేసీర్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. 52రోజుల పాటు అటు ప్రజలను ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసిన ఆర్టీసీ కార్మికుల సమస్యకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పెట్టిన అనంతరం.. అంతర్గత సమస్యలపై దృష్టి సారించారు. యూనియన్ల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సీఎం భావిస్తున్నారు. వారే కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని.... సంస్థలో ఉన్న వాస్తవ పరిస్థితులను... కార్మికులకు తెలుపుతున్నారో లేదో అనే అనుమానాలను ఆయనే స్వయంగా వ్యక్తం చేశారు. ఎన్నికలు ,యూనియన్ల మాయలో పడి సంస్థపై భారం పడే నిర్ణయాలకు యూనియన్లు కారణమవుతున్నాయని సీఎం పలుసార్లు చెప్పారు.
ప్రతి డిపోకు 5గురు కార్మికులు
ఈనేపథ్యంలోనే కార్మికులతో నేరుగా తానే మాట్లాడేందుకు సీఎం సన్నద్దమయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 97 డిపోలకు చెందిన వారిని సమావేశానికి ఆహ్వానించారు. ప్రతి డిపోకు అయిదుగురు చొప్పున ప్రతినిధులు రావాలని ప్రభుత్వం కార్మికులను కోరింది. ఇందులో ఇద్దరు మహిళలు తప్పకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఉదయమే వారితో క్షుణ్ణంగా చర్చించనున్నారు.
వాస్తవ స్థితిని వివరించనున్న సీఎం
ఆర్టీసీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిందని, దాన్ని ఏ ప్రభుత్వం వచ్చిన కాపాడలేని దుస్థితిలో ఉందని సీఎం పలుసార్లు వివరించారు. ప్రస్తుతం జీతాలు కూడ చెల్లించలేని స్థితిలో సంస్థ ఉందని తెలిపారు. దీంతో ఆ పరిస్థితిని నేరుగా సీఎం వారికి వివరించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం మొత్తం సమాచారాన్ని కార్మికులకు అందించేందుకు తెలుగులో ప్రింట్ చేసి వారికి పంపిణి చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో సమాచారాన్ని ముందుగా కార్మికులకు అందించనున్నారు.
కార్మికులకు భరోసా
మొత్తం మీద 50 రోజుల పాటు కార్మికుల సమ్మెపై పూర్తి వ్యతిరేకత కనిబరచిన సీఎం చివరికి అందరికి తీపి కబురును అందించారు. కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకుండా సానుకూలంగా వ్యవహరించారు. అయితే సమ్మె నేపథ్యంలో సీఎం వ్యవహరించిన తీరుతో కార్మికుల్లో పూర్తిగా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్లో ప్రభావం చూపే అవకాశాలు ఉండడంతో.... సంస్థ వాస్తవిక పరిస్థితులను వెల్లడించడంతో పాటు నేరుగా కార్మికులతో మాట్లాడడం ద్వార రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ఆర్టీసీ కార్మికుల్లో ఒక భరోస కల్పించడంతో ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం ఏర్పడే ప్రయత్నాలు చేయనున్నారు. ముఖ్యంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చి సింగరేణి సంస్థ వలే తీర్చిదిద్దాలనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఆ పరిణామాలన్నింటిని కార్మికులకు ఆయన వివరించనున్నారు. ముఖ్యంగా యూనియన్లు లేకుండా కార్మికుల సమస్యలను ఎలా పరిష్కరిస్తానే అంశాలను కూడ ఆయన వారితో పంచుకోనున్నారు.