అసెంబ్లీ, సెక్రటేరియట్కు సీఎం భూమిపూజ.. కేసీఆర్ విధానాలపై మండిపడ్డ బీజేపీ
Recommended Video
హైదరాబాద్ : వివాదాలు చుట్టుముట్టాయి. విపక్షాలు గొంతెత్తి అరిచాయి. చారిత్రక కట్టడం కూల్చొద్దనే డిమాండ్లు వినిపించాయి. ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దనే సూచనలు వచ్చాయి. అయినా సీఎం కేసీఆర్ అవేమీ పట్టించుకోలేదు. తనదైన స్టైల్లో ముందుకెళ్లారు. ఎవరు ఎంత చెప్పినా.. అరిచి గీ పెట్టినా.. తాను చేయాలనుకున్న పని చేసేశారు. అసెంబ్లీ, సచివాలయ కొత్త భవనాలు అవసరం లేదనే ఆరోపణలు వెల్లువెత్తినా.. తాను ఏ మాత్రం తగ్గలేదు. చివరకు గురువారం నాడు శుభ ముహుర్తాన భూమి పూజ చేశారు.
అప్పుల కుప్ప తెలంగాణ.. వడ్డీయే 11 వేల కోట్లు!.. కేంద్రం బయట పెట్టిన నిప్పులాంటి నిజాలు..!
సచివాలయానికి శంకుస్థాపన.. 400 కోట్లతో నిర్మాణం
400 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేశారు కేసీఆర్. ప్రస్తుత సెక్రటేరియట్ డి - బ్లాక్ వెనుక ప్రాంతంలోని గార్డెన్ ఏరియాలో నూతన సచివాలయం నిర్మిస్తున్నారు. దాంతో 25 ఎకరాల్లో విస్తరించి ఉన్న సచివాలయాన్ని 30 ఎకరాలకు పొడిగించినట్లైంది. వాస్తు దోషం లేకుండా సకల హంగులతో కొత్త భవనం రూపుదిద్దుకోనుంది.
చరిత్రలో నిలిచిపోయేలా కొత్త సచివాలయం నిర్మించాలన్నది కేసీఆర్ ఆశయం. ఆ మేరకు సకల సౌకర్యాలతో, అన్ని హంగులతో పూర్తి వాస్తు ప్రకారం నిర్మించనున్నారు. ఆ మేరకు గురువారం నాడు శుభ ముహుర్తాన భూమిపూజ చేశారు కేసీఆర్.
ప్రజాధనం దుర్వినియోగమంటున్న విపక్షాలు
అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా కాన్ఫరెన్స్ హాల్ నిర్మించనున్నారు. ఇకపై ముఖ్యమంత్రి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు సచివాలయంలోనే నిర్వహించడానికి వీలుగా నిర్మాణం జరగబోతోంది. దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే కొత్త సచివాలయంలో మంత్రులు, సంబంధిత శాఖల కార్యదర్శులు, సెక్షన్లు అన్నీ ఒకే దగ్గర ఉండేలా నిర్మాణాలు జరగనున్నాయి.
అదలావుంటే కొత్త సచివాలయం నిర్మాణంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందంటూ అపొజిషన్ లీడర్లు మండిపడుతున్నారు. సచివాలయం నిర్మాణాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే న్యాయపోరాటం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్ పై శుక్రవారం విచారణకు రానుండటం గమనార్హం. అంతలోపే గురువారం నాడు కేసీఆర్ భూమిపూజ చేయడం చర్చానీయాంశమైంది.
అసెంబ్లీ భవనానికి భూమిపూజ.. 100 కోట్లతో నిర్మాణం
కొత్త సచివాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ఎర్రమంజిల్లో నూతన అసెంబ్లీ భవనానికి కూడా భూమిపూజ చేశారు కేసీఆర్. వేదమంత్రోచ్ఛరణాల మధ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వయంగా పునాది తవ్వారు. 100 కోట్ల రూపాయలతో అసెంబ్లీ, శాసన మండలి, సెంట్రల్ హాల్ నిర్మించనున్నారు.
ప్రస్తుతం నాంపల్లిలో కొనసాగుతున్న అసెంబ్లీ భవనం నిజాం కాలం నాటిది కావడంతో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా కొత్త భవన సముదాయం కట్టబోతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చాలా స్థలాలు చూసినప్పటికీ ఎర్రమంజిల్లోనే కొత్త అసెంబ్లీ కట్టేందుకు మొగ్గు చూపారు కేసీఆర్. పాత అసెంబ్లీ బిల్డింగును హెరిటేజ్ భవనంగా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం.
మళ్లీ పునర్విభజన దిశగా వరంగల్.. కొత్త జిల్లాలకు సీఎం గ్రీన్ సిగ్నల్..! మొత్తం ఎన్నంటే..!
సచివాలయం నిర్మాణంపై భగ్గుమన్న బీజేపీ.. ముట్టడి యత్నం
కొత్త నిర్మాణాల పేరిట సీఎం కేసీఆర్ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే నిరసన పర్వంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు పలువురు నేతలు సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ముషీరాబాద్ పీఎస్కు తరలించారు. మరోవైపు సచివాలయం ముట్టడికి తరలివస్తున్న బీజేపీ లీడర్లను పలుచోట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
వాస్తు దోషమంటూ.. ఇతర కారణాలు చెప్పుకుంటూ వేల కోట్ల రూపాయలను నీటిపాలు చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. పేద ప్రజల కోసం రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామని గొప్పలు చెప్పిన కేసీఆర్ కనీసం 20 వేల ఇళ్లు కూడా నిర్మించలేదని ధ్వజమెత్తారు. నియంతలా ప్రజాధనం ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తుంటే ప్రజలే కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు.
చారిత్రక కట్టడం కూల్చొద్దనే డిమాండ్
రాజధాని నడిబొడ్డున ఉన్న ఎర్రమంజిల్ ప్యాలెస్ను కూల్చొద్దనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆ ప్యాలెస్ నిర్మించిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసులు చారిత్రక కట్టడం జోలికి రావొద్దని డిమాండ్ చేశారు. కొత్త నిర్మాణాల పేరిట అసెంబ్లీ, సచివాలయం కోసం 500 కోట్ల రూపాయలు వెచ్చించడం ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని ఆరోపించారు. 1817వ సంవత్సరంలో నిర్మితమైన ఈ కట్టడం ఇప్పటికీ చెక్కుచెదరలేదని చెప్పుకొచ్చారు. నాంపల్లిలో ప్రస్తుతమున్న అసెంబ్లీ బిల్డింగ్ పటిష్టంగా ఉన్నప్పటికీ.. కొత్త భవనం నిర్మించడం ఎందుకని ప్రశ్నించారు. వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాలను కాపాడాల్సింది పోయి కూలగొట్టడం తగదన్నారు.
చారిత్రక భవనాలు కూల్చాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయని.. వాటిని పట్టించుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదన్నారు సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యదర్శి డాక్టర్ లుగ్నా సర్వర్.