ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్... డీఏ,దసరా సెలవుపై కీలక నిర్ణయం...
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త అందించారు. 2019 జులై నుంచి ఉద్యోగులకు అందాల్సిన డీఏను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఉన్న 33.53శాతం డీఏని మరో 5.25శాతానికి పెంచి... 38.77 శాతం డీఏని ఉద్యోగులకు ఇవ్వాలని సూచించారు. 'బేసిక్ పే'పై పెంచిన డీఏని జులై 2019 నుంచి వర్తింపజేయనున్నారు. అయితే ప్రస్తుతం ఉద్యోగులకు అందిస్తున్న డీఏ విషయంలో అనుసరిస్తున్న విధానంలో మార్పు రావాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సమస్యలు,బడ్జెట్ మధ్యంతర సమీక్ష,పంట కొనుగోళ్లు తదితర అంశాలపై శుక్రవారం(అక్టోబర్ 23) ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
బస్సుల రవాణాపై తేల్చని టీఎస్ఆర్టీసీ ... కేసీఆర్ స్పందించాలన్న ఏపీ మంత్రి
డీఏపై రాష్ట్రమే నిర్ణయం తీసుకునేలా ప్రతిపాదనలు...
డీఏ పెంపు నిర్ణయానికి సంబంధించి కేంద్రం అంచనాలు తయారుచేయడం.. దాన్ని ఫైనల్ చేసే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందని కేసీఆర్ అన్నారు. ఫలితంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు పేరుకుపోతున్నాయని అన్నారు. కాబట్టి ప్రతీ ఆర్నెళ్లకు ఒకసారి చెల్లించాల్సిన డీఏపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకునేలా ప్రతిపాదనలు తయారుచేసి... దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన మూడు డీఏల్లో రెండింటి విషయంలో కేంద్రం ఇప్పటికే తమ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందన్నారు.
దసరా సెలవుపై కీలక నిర్ణయం...
దసరా సెలవు విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి ఏడాది దసరా మరుసటి రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని... ఈ మేరకు షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై సమస్యలపై చర్చిస్తామన్నారు. కాగా,ఈసారి దసరా పండగ ఆదివారం వచ్చిన సంగతి తెలిసిందే.
మధ్యంతర బడ్జెట్ సమీక్ష
తాజా సమీక్ష సమావేశంలో బడ్జెట్పై కూడా కేసీఆర్ చర్చించారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం,కేంద్రం నిధులు భారీగా తగ్గినందునా బడ్జెట్పై మధ్యంతర సమీక్ష అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్రం జడీపీ భారీగా పడిపోవడం... రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడిన నేపథ్యంలో నిధుల అందుబాటుపై సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వాస్తవంగా అందుబాటులో ఉన్న నిధులెన్ని... ఏయే శాఖలకు ఏ మేర నిధులకు అవకాశం ఉంది... వీటిపై అంచనా అవసరమన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్పై సమీక్ష నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.