భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం ... వాతావరణ శాఖ హెచ్చరికలతో
తెలంగాణా రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కావలసిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా సమాచారం తెలుసుకుంటూ తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తున్నారు. వర్షాలు మరో రెండు రోజులపాటు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో నేడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ముంపులోనే ఓరుగల్లు ... చరిత్రలోనే మొదటిసారి .. వేలాది ప్రజల కన్నీటి వరద
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ముఖ్యంగా, వర్షాల ధాటికి అత్యంత ప్రభావితమైన ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం ,కరీంనగర్ జిల్లాలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. రాష్ట్రంలో వరద ఉధృతి పెరుగుతున్న నేపధ్యంలో అవసరమైతే హెలికాప్టర్ లను కూడా రంగంలోకి దించి సహాయక చర్యలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణా రాష్ట్రంలో మరోపక్క ప్రతిపక్షాలు వరంగల్ లో తాజా వరద పరిస్థితిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే చారిత్రక నగరం ముంపుకు కారణం అని ఆరోపిస్తున్నారు.
ఈ సమయంలో మరో రెండు రోజులపాటు వర్ష బీభత్సం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ఏర్పడిన పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈరోజు మధ్యాహ్నం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సిఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, జలవనరుల శాఖ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీ రాజ్, వ్యవసాయ, ప్రకృతి వైపరీత్యాల నివారణ శాఖల అధికారులు పాల్గొననున్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో హెల్ప్ లైన్ నెంబర్స్ ను ఏర్పాటు చేసి అధికార యంత్రాంగాన్ని వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తాజాగా వరద మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తుండడంతో సీఎం కేసీఆర్ వరద పరిస్థితులపై ఈరోజు సమీక్షించనున్నారు.