హైదరాబాద్లో తాగునీటి కష్టాలు ఉండొద్దు.. సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ : భాగ్యనగరంలో తాగునీటి రిజర్వాయర్ నిర్మించే విషయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రతి ఇంటికీ తాగునీటి కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్, నీటి పారుదల శాఖ అధికారులు సమావేశమై ఆ మేరకు తాగునీటి రిజర్వాయర్, పైపులైన్లకు సంబంధించి అంచనాలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లకు నీటి సరఫరా జరుగుతోంది. ప్రాజెక్టుల నీటిలో పది శాతం తాగునీరు వాడుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఆ క్రమంలో సదరు రిజర్వాయర్ల నుంచి భాగ్యనగరానికి తాగునీరు అందించాలని సూచించారు. కేశవరం దగ్గర రిజర్వాయర్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించాలని చెప్పారు.
ఆ రెండూ దొందూ దొందే.. టీఆర్ఎస్, బీజేపీపై శ్రీధర్ బాబు గరం
కేశవరం నుంచి హైదరాబాద్కు తాగునీరు సరఫరా జరగాలన్న కేసీఆర్.. ఆ మేరకు వెంటనే అంచనాలు రూపొందించాలన్నారు. గోదావరి, కృష్ణా నీటిని ప్రస్తుతం అనుసరిస్తున్న పద్దతిలోనే తరలిస్తూ.. అల్టర్నేట్ గా రిజర్వాయర్ కూడా నిర్మించాలన్నారు. హైదరాబాద్ లో ఎన్నటికీ తాగునీటి సమస్య రాకుండా చూడాలన్నారు. దానికోసం వెంటనే డెడికేటెడ్ రిజర్వాయర్ నిర్మించాలన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల నుంచి గోదావరి నీటిని తరలించాలని.. ఆ క్రమంలో ప్రతిపాదిత మంచినీటి రిజర్వాయర్ను ఎప్పటికపుడు నింపుతూనే ఉండాలని నిర్దేశించారు.