డిజిటల్ సర్వే: మార్చడం ఎవరి తరం కాదు:, సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ విధానం అమలు చేస్తామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే చేయబోతున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఇంతకుముందే ప్రకటించామని తెలిపారు. సర్వే కోసం టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. సర్వే చేసి వ్యవసాయ భూములకు కచ్చితమైన కొలతలు ఇస్తామని తెలిపారు.
ప్రతిభూమికి కో ఆర్డినేట్స్ (అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని, వాటిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. ఇప్పటికే డిజిటల్ సర్వే ప్రారంభం కావాల్సి ఉందని, కానీ కరోనా వైరస్ వల్ల ఆలస్యం అయిందని అన్నారు. ఒక్కసారి సర్వే పూర్తయితే అన్ని రకాల భూముల మధ్య స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పనితీరుపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వంద శాతం విజయవంతమైందని తెలిపారు. ధరణి రాకతో రెవెన్యూ విభాగంలో అవినీతి అంతమైందని తెలిపారు. అమాయక రైతులకు న్యాయం జరిగిందని వివరించారు. ఒకరి భూమిని మరొకరి పేరు మీద రాసే అరాచకాలు, జుట్టుకు జుట్టు ముడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయాలు, డాక్యుమెంట్లు గోల్ మాల్ చేసి రెవెన్యూ కోర్టుల పేరిట జరిగే దుర్మార్గాలు ఆగిపోయాయని వివరించారు.