అందుకు కొరత లేదన్న సీఎం కేసీఆర్.. అలసత్వమంటూ ఫైర్ అయిన ఎంపీ బండి సంజయ్
రాష్ట్రంలో వైద్యులకు రక్షణ దుస్తులు అందించట్లేదన్న విమర్శలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్టిపారేశారు. ప్రభుత్వం వద్ద 40వేల పీపీఈ కిట్లు సిద్దంగా ఉన్నాయన్నారు. మరో 5లక్షల కిట్లు,లక్షలాది మాస్కుల కోసం ఆర్డర్ ఇచ్చామన్నారు. ఇలాంటి తరుణంలో కూడా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని అసత్యాలను ప్రచారం చేయడం తగదన్నారు. చిల్లర ప్రచారాలకు ఇకనైనా తెరదించాలని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ ఎంత పతనమైనా సరే ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. కాబట్టి లాక్ డౌన్ను పొడగించాలని.. అదే మనకున్న ఏకైక ఆయుధమని కేసీఆర్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
డాక్టర్ల రక్షణ దుస్తులు,మాస్కులకు కొరత లేదని ఓవైపు సీఎం కేసీఆర్ స్పష్టం చేయగా.. మరోవైపు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాత్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన సౌకర్యాలు అందించకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల డాక్టర్లు ఉద్యోగాన్ని వదులుకునే పరిస్థితికి రావడం దురదృష్టకరమన్నారు. దేశం మొత్తం డాక్టర్లకు చేతులెత్తి మొక్కుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారిపై దయ, కరుణ చూపకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు.
డాక్టర్లకు రక్షణ దుస్తులు,ఇతరత్రా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం వహించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపాదికన రాష్ట్రంలో ఐసీయూ, ఐసోలేషన్తోపాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న డాక్టర్లకు, వైద్యులకు కిట్స్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అత్యవసర సేవలు,పరికరాలు,నిధులపై కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరించడం సరికాదని స్పష్టం చేశారు.
అటు సీఎం కేసీఆర్ తన ప్రెస్మీట్లో వైద్యులు,పారిశుద్ద్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నందుకు వారికి మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నట్టు తెలిపారు. ఇదే స్పూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాలన్నారు. డాక్టర్లకు ప్రత్యేక గిఫ్ట్ కింద గ్రాస్ సాలరీలో మరో 10శాతం అదనంగా వేతనంతో కలిపిస్తామన్నారు. అలాగే జీహెచ్ఎంసీ,హెఎండబ్ల్యూఎస్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు రూ.7500 అదనంగా అందించనున్నట్టు తెలిపారు.అలాగే మున్సిపాలిటీలు,గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న పారిశుద్ద్య కార్మికులకు రూ.5వేలు అదనపు వేతనం అందిస్తున్నట్టు తెలిపారు. ఇంత సంక్లిష్ట సమయంలో వారికి ఏమిచ్చినా తక్కువేనని.. మున్ముందు ప్రభుత్వం వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని తెలిపారు.