సీఎం కేసీఆర్ సంచలనం .. మరో మూడు టర్మ్లు టీఆర్ఎస్ నే .. ఇంకో పదేళ్ళు తానే సీఎం
తెలంగాణ సీఎం కేసీఆర్ మనసులో మాట బయట పెట్టారు. కెసిఆర్ తన కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయాలని చూస్తున్నారని, అందుకోసమే హరీష్ రావును పక్కకు పెట్టారని గత కొంత కాలంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఆ విమర్శలకు సమాధానంగా హరీష్ రావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాకుండా, తాజాగా శాసనసభ సమావేశాల్లో సీఎం స్థానం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ .
30 రోజుల కార్యాచరణ ప్రణాళిక .. మా వల్ల కాదంటున్న గ్రామ కార్యదర్శులు
కేటీఆర్ భావి సీఎం వార్తలపై సీఎం కేసీఆర్ క్లారిటీ
రాష్ట్రంలో మరో మూడు సార్లు టీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. అంతేకాదు తాను గట్టిగానే ఉన్నానని మరో పదేళ్లు సీఎంగా పాలన సాగిస్తానని ఆయన తన మనసులోని మాటను వెల్లడించారు. ఇక కెసిఆర్ తన వ్యాఖ్యలతో కేటీఆర్ ను సీఎం చెయ్యాలని చూస్తున్నారన్న వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆదివారం శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సీఎం స్థానంపై క్లారిటీ ఇచ్చారు. ఇక వచ్చేసారి కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు. ఇక ఆయన తన ఆరోగ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దుక్కలాగున్నా.. మరో పదేళ్ళు నేనే సీఎం అన్న కేసీఆర్
కెసిఆర్ సభలో చేసిన వ్యాఖ్యలను యధాతథంగా గమనిస్తే ‘‘నాకు చాలామంది మిత్రులున్నరు అధ్యక్షా. 20ఏళ్ల నుంచి చెప్తనే ఉన్నరు.. కేసీఆర్ ఆరోగ్యం ఖతమైందట కదా! అమెరికాకు పోతడట కదా! నేను సచ్చిపోవట్టి 20 ఏళ్లయింది అధ్యక్షా... 20 ఏళ్లయింది గని నేను చావలే. ఇప్పుడు గూడా నాకేమైంది అధ్యక్షా. దుక్కలాగున్నా .. ఇప్పుడు గూడా చెప్తున్నరు.. కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ను చేసుడు (సీఎంగా) పక్కానేనా? అని! నాకు పాణం వాటం లేదా.. నాకు ఏమైందని? నేను చెప్పినయన్ని జరుగుతయి! మంచి పనులు చేస్తున్న కాబట్టి టీఆర్ఎస్ కనీసం మూడు టర్మ్లు అధికారంలో ఉంటది. ఇప్పుడు నాకు 66 ఏళ్లు అధ్యక్షా. ఇంకో పదేండ్లదాకనైనా చేయనా? ఈ టర్మ్ల నేనే ఉంటా.. వచ్చే టర్మ్ల నేనే ఉంటా అధ్యక్షా. యాడికి పోను. ఎన్ని శాపాలు పెట్టిన గట్టిగనే ఉంటా. ప్రజల దీవెన. దేవుని దయ'' అంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరో మూడు టర్మ్ లు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పిన సీఎం కేసీఆర్
ఇక తాజా వ్యాఖ్యలతో అటు గులాబీ పార్టీ నేతలకే కాకుండా, ప్రతిపక్ష పార్టీ నేతలకు సైతం మరో పదేళ్లపాటు టిఆర్ఎస్ అధికారంలో ఉంటే సీఎం కుర్చీ తనదేనని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. మరో మూడు టర్మ్ లు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక కేసీఆర్ వ్యాఖ్యలు విన్న కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత బట్టి విక్రమార్క కేసీఆర్ నిండు నూరేళ్లు బాగుండాలని, ఆయన పాలనలో రాష్ట్రానికి మేలు జరగాలని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు బతికి ఉండాలంటే తిండి తినాలని, తానింకా తినలేదని సరదాగా సంభాషించారు.