మోదీని నమ్మితే శంకరగిరి మాన్యాలే.. కాంగ్రెస్కు తాతలా బీజేపీ తయారైంది.. అసెంబ్లీలో కేసీఆర్ ఫైర్
రాజ్యాంగం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన నిధులకు కోతలు పెట్టడంలో ప్రస్తుత బీజేపీ సర్కారు గత కాంగ్రెస్ కంటే తాతలా తయారైందని సీఎం కేసీఆర్ విమర్శించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఏడాది కూడా పట్టుమని 10వేల కోట్లు ఇవ్వలేదని, మోదీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే గతయ్యే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ సభ్యులు చేసిన విమర్శలకు గురువారం ఆయన అసెంబ్లీలో సమాధానం చెప్పారు.
Recommended Video
కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయంటూ బీజేపీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని, ఢిల్లీలో లేకలేక అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. కాంగ్రెస్ కంటే ఘోరంగా రాష్ట్రాలను పీక్కుతింటున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రావడానికి సుదీర్ఘకాలం ఎదురుచూసిందని, అది కూడా యూపీఏ పాలనపై విసుగుతోనే జనం బీజేపీని గెలిపించారుతప్ప ప్రత్యేకంగా వాళ్లకంటూ ఘనతలేదని, అదే టీఆర్ఎస్ మాత్రం ఉద్యమపార్టీగా పుట్టి, రాష్ట్రాన్ని సాధించుకుని అధికారం చేపట్టిందని సీఎం గుర్తుచేశారు. దేశాన్ని నడిపించడంలో జాతీయ పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీలు అట్టర్ప్లాఫ్ అయ్యాయని, రాకరాక వచ్చిన చాన్సును బీజేపీ దారుణంగా దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు.
దేశంలో పన్నుల వ్యవహారాలకు సంబంధించి రాజ్యంగంలో స్పష్టంగా రాసుందని, కేంద్రానిది వసూలు చేసే బాధ్యతేగానీ, రాష్ట్రాలు బిచ్చమెత్తుకున్నట్లు కాదని, ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రాలకు విధిగా నిధులు ఇవ్వాల్సిందేనని సీఎం కేసీఆర్ అన్నారు. జీఎస్టీ వల్ల కలిగే నష్టాన్ని ఐదేళ్ల పాటు భరిస్తామని కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
అంతకుముందు ఆర్థిక మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బడ్జెట్పై ప్రజలు సంతోషంగానే ఉన్నా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రమే నిరాశగా ఉన్నాయన్నారు. సంక్షేమ రంగానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించామని, కాంగ్రెస్ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం కూడా చేయలేదని, కేంద్రం నుంచి నిధులు రాకున్నా హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.10 వేల కోట్లు కేటాయించామని రాబోయే ఐదేళ్లలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం దూసుకెళుతుందని మంత్రి హరీశ్ చెప్పారు.