విజయదశమి రోజున ధరణి పోర్టల్ ప్రారంభం.. మంచి రోజు కావడంతో ముహూర్తం ఖరారు...?
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపట్టింది. వీఆర్వో వ్యవస్థ రద్దు తర్వాత.. ధరణి పోర్టల్ అప్ డేట్ చేశారు. దీనిని విజయదశమి రోజున సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. ఆ రోజు మంచిరోజు కావడంతో ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ధరణి పోర్టల్కు అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్వేర్, బ్యాండ్ విడ్త్లను సిద్ధం చేస్తున్నారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, మ్యూటేషన్ చేయడం, ధరణి పోర్టల్కు వివరాలను అప్డేట్ చేయడం తదితర విధానాలపై తహసీల్ధార్లు, డిప్యూటీ తహసీల్ధార్లు, సబ్ రిజిస్ట్రార్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి డెమో ట్రయల్స్ కూడా నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించనున్నారు.
మండలానికి ఒకరు చొప్పున సబ్ రిజాస్ట్రార్ కార్యాలయంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ల నియామలను పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నట్టు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్స్కు లైసెన్స్ ఇచ్చి వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
దసరా లోపు అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటాను ధరణి పోర్టల్లో ఎంటర్ చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. ఆ తర్వాత జరిగే మార్పు చేర్పులు వెంటనే నమోదు చేస్తామని సీఎం చెప్పారు. ఈ లోగా ఎలాంటి రిజిస్ట్రేషన్, రెవెన్యూ వ్యవహారాలు జరగవని స్పష్టం చేశారు.