మున్సిపాల్టీలు పోతే..మంత్రి పదవులు పోతాయి: ఏకపక్షంగా గెలవాల్సిందే: కేసీఆర్ హెచ్చరిక!
మున్సిపాల్టీ ఎన్నికల్లో సర్వేలన్నీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని..స్థానిక సంస్థల తరహాలో ఏకపక్షంగా గెలవాల్సిందేనని ముఖ్యమంత్రి..టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేసారు. మంత్రులు..ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుంటూ పార్టీ గెలుపుకు పని చేయాలని నిర్దేశించారు. మున్సిపాల్టీలు పోతే..అక్కడి మంత్రుల పదవులు సైతం పోతాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు కేడర్తో మమేకం కావాలని...ప్రతీ మున్సిపాల్టీ పరిధిలో ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలని కేసీఆర్ నిర్ధేశించారు. ఎన్నికలు ముగిసే వరకూ ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మున్సిపాల్టీల గెలిస్తేనే..పదవులు ఉంటాయి..
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక సూచనలు చేసారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల గురించి కేడర్ కు దిశా నిర్ధేశం చేసారు. ఇప్పటికే సర్వేలన్నీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని.. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
అవసరమైన చోట మంత్రుల ప్రచారం
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని ఆదేశించారు. అవసరం ఉన్న చోట మంత్రులు ప్రచారం చేస్తారని కేసీఆర్ చెప్పారు. అదే సమయంలో మంత్రులకె హెచ్చరికలు చేసారు. ఎక్కడైనా మున్సిపాల్టీ ఓడితే..అక్కడ మంత్రి పదవులు పోతాయని తేల్చి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు విభేదాలు మరిచి ఐక్యమత్యంతో పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
బీజేపీతో పోటీ కాదు...మనకే అనుకూలం
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో పోటీ అనే అపోహ వద్దని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అసలు తమ పార్టీకి ఎవరూ పోటీ కాదన్నారు. నియోజకవర్గాల్లో క్యాడర్తో ఎమ్మెల్యేలు ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని, పాత కొత్త నాయకులు సమన్వయంతో ఉండాలని సూచించారు.
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
ఇక ఇదిలా ఉంటే..పురపాలక రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తయింది. ఆయా వర్గాల వారీగా పదవుల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. 2011 జనాభా ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీల జనాభా ఒక శాతానికి తక్కువగా ఉన్న.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్ అయింది. రిజర్వేషన్ల వివరాలను కలెక్టర్లకు ప్రభుత్వం పంపించింది. ఆదివారం వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు కానున్నట్లు అధికారులు వెల్లడించారు.