కారెక్కనున్న టీడీపీ సీనియర్..! మండవ ఇంటికి కేసీఆర్.. కూతురు గెలుపు కోసమేనా?
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న గులాబీ ఆపరేషన్ ఆకర్ష్ మరో టీడీపీ వికెట్ పడగొట్టింది. రాష్ట్రంలో సైకిల్ ఉనికి లేకుండా చేయాలనుకున్న గులాబీ బాస్ సంకల్పానికి కాలం కూడా కలిసి వస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంకట వీరయ్యకు ఇప్పటికే గులాబీ తీర్థం పోశారు.అటు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా కారెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన సీనియర్ నేత నివాసానికి సీఎం కేసీఆర్ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
30 ఏళ్లుగా ముస్లిం ఎంపీలే లేరు..! ఆ స్టేట్ మొత్తం అంతేనా?
మండవ ఇంటికి కల్వకుంట్ల
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే విషయం మరోసారి స్పష్టమైంది. టీడీపీకి చెందిన సీనియర్ నేత మండవ వెంకటేశ్వర రావు ఇంటికి స్వయంగా వెళ్లిన సీఎం కేసీఆర్.. తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తాను కేసీఆర్ తో కలిసి నడవనున్నట్లు ప్రకటించారు మండవ.
నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ నాయకుడు మండవ వెంకటేశ్వరరావు. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీకి సేవలందించారు. ఏళ్లకొద్దీ టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న మండవ.. ఇప్పుడు సైకిల్ దిగి కారెక్కనున్నారు. శుక్రవారం (05.04.2019) మధ్యాహ్నం ఆయన ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లిన సందర్భంలో గులాబీ వనంలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఉదయం మండవ వెంకటేశ్వర రావు ఇంటికెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్, మాగంటి గోపినాథ్.. పార్టీలో చేరికపై ఆయనతో మాట్లాడినట్లు సమాచారం.
టీడీపీకి దూరంగా ఉంటున్న మండవ
నిజామాబాద్ జిల్లాలో రాజకీయ నేతగా మండవ వెంకటేశ్వరరావు కీ రోల్ పోషించారు. డిచ్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. అయితే, 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో చాలా కాలం నుంచి ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగానే ఉంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. జిల్లా పార్టీ కార్యాలయానికి కూడా ఆయన పెద్దగా వెళ్లిన దాఖలాలు లేవు. 2018 ఎన్నికల్లో మహాకూటమి పొత్తుల్లో భాగంగా డిచ్పల్లి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు. హస్తం గుర్తుపై పోటీచేసిన రేకులపల్లి భూపతిరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమిచెందారు.
సైకిల్ కు బై బై.. కారులోకి ఎంటీ
నిజామాబాద్ జిల్లాకే చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ గూటికి ఎప్పుడో చేరారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం దక్కింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక స్పీకర్ గా ప్రమోషన్ ఇచ్చారు కేసీఆర్. అయితే అదే జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వర రావు అటు టీడీపీకి దూరంగా ఉన్నారే తప్ప ఇన్నాళ్లు గులాబీవనం వైపు చూడలేదు. ఒకానొక సందర్భంలో ఆయన రాజకీయాలకు శాశ్వతంగా దూరం కానున్నారనే టాక్ కూడా నడిచింది.
అదలావుంటే సీఎం కేసీఆర్ మండవ వెంకటేశ్వర రావు ఇంటికెళ్లిన సందర్భంగా టీఆర్ఎస్ లో చేరాలనే ప్రతిపాదన తెచ్చినట్లు తెలుస్తోంది. దానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారట. ఆ క్రమంలో రెండు, మూడు రోజుల్లో మండవ కారెక్కనున్నారనే చర్చ జరుగుతోంది.
ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం..! కవిత కోసమేనా?
ఉమ్మడి రాష్ట్రాన చంద్రబాబు మంత్రివర్గంలో కేసీఆర్, మండవ సహచరులుగా ఉన్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహముంది. అయితే రాజకీయ వైరుధ్యం నేపథ్యంలో ఇద్దరు వేరయ్యారు. అప్పటినుంచి కూడా పెద్దగా కలిసిన దాఖలాలు లేవు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే మండవ కారెక్కుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన మాత్రం పెదవి విప్పలేదు. అదలావుంటే తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ అనూహ్యంగా మండవను కారెక్కించేందుకు సిద్ధమయ్యారనే టాక్ నడుస్తోంది. నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికల బరిలో నిలిచిన తన కూతురు కవిత విజయానికి లైన్ క్లియర్ చేసేందుకే అర్జెంట్ గా ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన లేకపోలేదు. కవితను వ్యతిరేకిస్తూ 178 మంది రైతులు నామినేషన్లు వేయడం తెలిసిందే.