రేపు యాదాద్రికి కేసీఆర్: పునఃప్రారంభ ముహూర్తం ప్రకటనకు ఛాన్స్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం యాదాద్రి ఆలయాన్ని సందర్శించనున్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం జీర్ణోద్ధారణ పనులు ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో వాటిని స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఆలయాన్ని పునఃప్రారంభించడానికి అవసరమైన ముహూర్తంపై ఆలయ అర్చకులతో చర్చిస్తారు. దీనిపై ఓ నిర్ణయానికి వస్తారు. ఆలయం పునఃప్రారంభించే సమయంలో మహా సుదర్శన యాగాన్ని నిర్వహించాల్సి ఉంది.
మహా సుదర్శన యాగానికి సంబంధించిన పూర్తి వివరాలను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థను కేసీఆర్ పరిశీలిస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత.. ఈ ఆలయానికి మహర్దశ పట్టిన విషయం తెలిసిందే. 1,800 కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేస్తోంది కేసీఆర్ సర్కార్. యాదాద్రిలో విశాలమైన రోడ్లను నిర్మించింది. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలను వ్యయం చేసింది.
ఉదయం 11:30 గంటలకు కేసీఆర్ హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి యాదాద్రికి బయలుదేరి వెళ్తారు. ఆయన వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సూర్యాపేట్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, అధికారులు, నల్లగొండ, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు. నిర్మాణ పనులను పర్యవేక్షించిన అనంతరం అదే రోజు సాయంత్రం ఆయన హైదరాబాద్కు తిరిగి చేరుకుంటారు.
Soon to be unveiled Magnificent #Yadadri Lakshmi Narasimha Swamy temple which has been beautifully renovated
— KTR (@KTRTRS) October 10, 2021
Kudos to Hon’ble CM #KCR Garu for his vision to make it a tourist destination for all Indians#PrideOfTelangana pic.twitter.com/oNPLemNvc0
యాదాద్రి ఆలయ రూపు రేఖలన్నింటినీ ప్రభుత్వం సమూలంగా మార్చివేసింది. కొత్త మండపాలు వెలిశాయి. గాలి గోపురాలు రూపుదిద్దుకున్నాయి. ఆరు గోపురాలతో విరాజిల్లేలా తీర్చిదిద్దింది. యాదాద్రి గుట్టపై అందుబాటులో ఉన్న స్థలంలోనే ఈ ఆలయాన్ని అత్యద్భుతంగా పునర్నిర్మాణం చేసింది కేసీఆర్ సర్కార్. కొద్దిరోజుల కిందటే దీనికి సంబంధించిన ఓ సమగ్ర వీడియోను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఈ ఆలయం పునఃప్రారంభించడానికి ఇదివరకే శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ముహూర్తాన్ని ఖాయం చేసినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందటే కేసీఆర్.. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చినజీయర్ స్వామివారి ఆశ్రమాన్ని సందర్శించారు. యాదాద్రి దేవస్థానం పునర్నిర్మాణ పనుల గురించి వివరించారు. పునఃప్రారంభ ముహూర్తాన్ని నిర్ధారించారు. ఈ ముహూర్తం ఎప్పుడనేది ఇప్పటిదాకా అధికారికంగా తెలియరాలేదు. ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. తాజాగా- కేసీఆర్ తన యాదాద్రి సందర్శన సందర్భంగా దీన్ని ప్రకటించే అవకాశం ఉంది.