చలి పంజా..! ఇంకెన్ని రోజులు గజగజ..?
హైదరాబాద్ : రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఇది మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. బుధవారం హైదరాబాద్ లో 9.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాత్రివేళలతో పాటు తెల్లవారుజామున చలి వీపరీతంగా ఉంటోంది. ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎన్నడూలేని విధంగా సిర్పూర్ లో కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీలకు పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
హైదరాబాద్ లో 9.3
తీవ్రమైన చలి గాలులతో హైదరాబాద్ వాసులు గజగజ వణికిపోతున్నారు. బుధవారం రాత్రి నార్మల్ టెంపరేచర్ కంటే 7.7 డిగ్రీలు తగ్గింది. దీంతో కనిష్ట ఉష్ణోగ్రత 9.3 డిగ్రీలుగా నమోదైంది. జనవరి నెల మొదట్లో కూడా ఇలాగే ఇదే స్థాయిలో టెంపరేచర్ రికార్డయింది. జనవరి మాసంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం.. గత పదేళ్లలో ఇది రెండోసారిగా తెలుస్తోంది. శనివారం వరకు పరిస్థితి ఇలాగే కొనసాగనున్నట్లు సమాచారం. ఉదయం, రాత్రి సమయాల్లో పొగమంచు ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తోంది.
మరో రెండు రోజులు తప్పదా?
ఉదయం ఏడు గంటలు దాటినా.. ఎండ కనపడని పరిస్థితి. హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ లాంటి ప్రాంతాల్లో టెంపరేచర్ మైనస్ 3 గా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. దాని కారణంగానే తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. గురువారం నుంచి 24 గంటల పాటు చలిగాలుల తీవ్రత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగి క్రమంగా సాధారణ స్థాయికి చేరుకునే అవకాశమున్నట్లు చెబుతున్నారు.
చలి పులి పంజా.. ఇద్దరు మృతి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలిపులి పంజా విసిరింది. కశ్మీర్ ను తలపిస్తోన్న ఆదిలాబాద్ లో మంగళవారం రాత్రి నుంచి చలి తీవ్రత బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఉదయం పది గంటలు దాటుతున్నా.. జనాలు బయటకు రాలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. చాలాచోట్ల 4 డిగ్రీలు, 7 డిగ్రీలు.. ఇలా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
చలి తీవ్రత కారణంగా కొన్ని ప్రాంతాల్లో వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. చలిని తట్టుకోలేక అస్వస్థతకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత కారణంగా ఇద్దరు చనిపోయినట్లు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకరు, వరంగల్ జిల్లాలో మరొకరు బలయ్యారు. చలి పెరిగిన కారణంగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశముండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. చలిలో ఎక్కువ తిరగకుండా వెచ్చదనం ఇచ్చే దుస్తులు ధరించాలని చెబుతున్నారు.