nagaraju: కదులుతోన్న డొంక.. కలెక్టర్, ఆర్డీవో పేర్లు తెరపైకి.. వరంగల్ నుంచి రూ.కోటి నగదు
కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసు కీలక మలుపు తిరిగింది. విచారణలో నాగరాజు సంచలన విషయాలు వెల్లడించారు. నిందితుల కస్టడీ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఈ అవినీతి భాగోతంలో కలెక్టర్, ఆర్డీవోకు కూడా భాగస్వామ్యం ఉందనే విషయాన్ని నాగరాజు స్టేట్ మెంట్ ఇచ్చారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. దీంతో కేసు కీలక పరిణామం చోటుచేసుకుంది.
జరిగింది ఇదీ..
రాంపల్లి దయార వద్ద ఉన్న 19 ఎకరాల 39 గుంటల భూమిని ఒరిజినల్ పట్టదారులకు ఇప్పించేందుకు అంజిరెడ్డి మధ్య వర్తిత్వం చేశాడు. తహశీల్దార్ నాగరాజుకు రూ.1.10 కోటి ఒప్పందం కుదిర్చాడు. డబ్బులను శ్రీనాథ్ యాదవ్ అనే వ్యక్తి సర్దుబాటు చేశాడు. విషయం తెలుసుకొన్న ఏసీబీ అధికారులు దాడి చేశారు. అంజిరెడ్డికి చెందిన ఫార్చ్యూనర్ కార్, శ్రీనాథ్ వోక్స్ వాగన్ కార్లను కూడా సీజ్ చేశారు. అంజిరెడ్డి స్నేహితుడి ఇంట్లో కీసర తహసీల్దార్ డీల్ కుదుర్చుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో రాసిన సంగతి తెలిసిందే.
కలెక్టర్, ఆర్డీవో రోల్....?
కలెక్టర్, కీసర ఆర్డీవో, హన్మకొండకు చెందిన తహశీల్దార్ ఒకరి పాత్ర ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. హన్మకొండ తహశీల్దార్ కిరణ్ ప్రకాశ్.. కీసర ఆర్డీవో రవితో ఒప్పందం కుదుర్చుకున్నారని డబ్బులు సమాకూర్చిన ఏ-3 శ్రీనాథ్ వెల్లడించారు. కీసర ఆర్డీవో రవి ద్వారా నాగరాజుతో ఒప్పందం జరిగిందని తెలిపారు. దాయరలోని 614, మరికొన్ని సర్వేనెంబర్లలో 61 ఎకరాలు ఏ-2 వీఆర్ఏ సాయిరాజ్, ఏ-4 అంజిరెడ్డి ద్వారా అగ్రిమెంట్ కుదిరిందని తెలిపారు.
ఆ బాధ్యత వారిదే..
మొయినుద్దీన్ మరో 37 మంది నుంచి భూమి అగ్రిమెంట్ చేశానని శ్రీనాథ్ తెలిపారు. కలెక్టర్తో భూమి మ్యూటేషన్ చేయించే బాధ్యత ఆర్డీవో, ఎమ్మార్వో చూసుకున్నారని పేర్కొన్నారు. రూ.1.10 కోట్లు వరంగల్ నుంచి తీసుకొచ్చానని, కలెక్టర్, ఆర్డీవో ఆదేశాలతోనే భూవివాదంపై మాట్లాడేందుకు గెస్ట్హౌస్కు వెళ్లానని నాగరాజు పేర్కొన్నారు.
Recommended Video
రిటైర్డ్ పోలీసును కూడా వదల్లేదు..
తహసీల్దార్ నాగరాజు అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తోంది. పోలీసు అధికారుల వద్ద నుంచి లంచం తీసుకున్నట్టు తెలుస్తోంది. బాధితుల్లో తాను ఒకరినని రిటైర్డ్ అదనపు ఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు. న్యాయపరంగా అన్ని పత్రాలు ఉన్నా.. పట్టా పాస్ పుస్తకం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడని మీడియాకు సురేందర్ రెడ్డి తెలిపారు. రిటైర్ అయ్యాక 2018లో సర్వేనెంబర్ 614లో 4 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశానని తెలిపారు. దానికి సంబంధించి తన వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని.. కానీ పట్టా పాస్బుక్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడని తెలిపారు. దీనిపై ఇదివరకు తాను సీఎస్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్, ఆర్డీవో ఫిర్యాదు చేశానని వివరించారు. అయినప్పటికీ ఫలితం లేదు అని సురేందర్ రెడ్డి తెలుపడం గమనార్హం.