తెలంగాణ బిడ్డకు మహవీర్ చక్ర : గాల్వాన్ ఘటనలో అమరుడైన కల్నల్ సంతోష్బాబు
హైదరాబాద్: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గత ఏడాది భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణల్లో అమరుడైన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం ప్రతిష్ఠాత్మక మహావీర చక్ర అవార్డును ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం దేశ రాజధానిలో నిర్వహించే వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ఈ అవార్డును అందజేస్తారు. ఈ ఏడాది మహావీర చక్ర అవార్డు కోసం కల్నల్ సంతోష్ బాబు పేరును ఖరారు చేశారు.
దేశ రక్షణకు సంబంధించినంత వరకు రెండో అత్యుత్తమ పురస్కారం మహవీర చక్ర. ఈ ఏడాది ఈ అవార్డును కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం.మిలటరీ అవార్డుల్లో అత్యుత్తమైనది పరమవీర్ చక్ర. ఆ తరువాత మహవీర్ చక్ర, వీర్ చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చ్ర పతాకాలను అత్యుత్తమ గ్యాలంట్రీ అవార్డులను భావిస్తారు.
గత ఏడాది జూన్ 15వ తేదీన లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) జవాన్లు జరిపిన దాడిలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఆయనతో పాటు 20 మంది అమరులు అయ్యారు. ఆయనతో పాటు సిపాయ్ ఓఝా, హవల్దార్ పళనిలకు అత్యుత్తమ గ్యాలంట్రీ అవార్డులను అందజేస్తారని తెలుస్తోంది. లఢక్ ఈశాన్య ప్రాంతంలో భారత భూభాగంపైకి అక్రమంగా చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన పీఎల్ఏ బలగాలను నిరోధించే సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది.
18 బిహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్గా ఉన్న కల్నల్ సంతోష్ బాబు సారథ్యంలో జవాన్లు చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని అడ్డుకోగలిగారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి.. వారిని వెనక్కి తరిమి కొట్టగలిగారు. ఈ ఘర్షణల్లో రెండు వైపులా ప్రాణనష్టం సంభవించింది. చైనా తరఫున 50 మందికి పైగా పీఎల్ఏ సైనికులు మరణించినట్లు సమాచారం ఉన్నప్పటికీ.. ఆ దేశ సైన్యాధికారులు దాన్ని ధృవీకరించలేదు. చైనా బలగాలను తరిమికొట్టడంలో, వారి దురాక్రమణను నిరోధించడంలో కల్నల్ సంతోష్ బాబు వీరోచితంగా పోరాడారని, చివరికి ప్రాణాలను సైతం వదిలారని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.