కూర్చున్న కొమ్మను నరుక్కోవద్దు .. ఆర్టీసీ సమ్మెకు పోవద్దు .. ఆర్టీసీ పై కమిటీ
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం జరిగిన క్యాబినెట్ సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కోసం సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించిన తెలంగాణ క్యాబినెట్ ముగ్గురు ఐఎఎస్ అధికారులతో కమిటీని నియమించింది.
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్!!! అక్టోబర్ 5 నుంచి స్ట్రైక్
ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం కమిటీ
మంత్రివర్గ భేటీలో ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సుదీర్ఘమైన చర్చ చేసింది క్యాబినెట్. ఆర్టీసీ కార్మికులు దసరా పండుగ సమయంలో సమ్మెకు దిగనున్న నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని మంత్రివర్గం కోరింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సాధ్యమైనంత త్వరితగతిన నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. అసలే నష్టాల్లో ఉన్న సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్ణయం మంచిది కాదని హితవు పలికింది.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై చర్చలు జరపనున్న కమిటీ
ఇక ఈ కమిటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధ్యక్షులుగా ఉంటే ముఖ్యకార్యదర్శులుగా రామకృష్ణారావు, సునీల్ శర్మలు, మరియు సభ్యులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. ఇక వీరు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి త్వరితగతిన ప్రభుత్వానికి నివేదిక అందజేస్తే ఆర్టీసీ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆర్టీసీని ఎలాగైనా కాపాడుకోవాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉన్న కారణంగా, సమ్మె ఆలోచనను విరమించుకోవాలని మంత్రివర్గం ఆర్టీసీ కార్మికులను కోరింది.
పండుగ సమయంలో ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దని హితవు
ఇక ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ప్రభుత్వం నియమించిన కమిటీతో మాట్లాడాలని , డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుందని కనుక కార్మికుల సమ్మె విరమించి విధులు నిర్వర్తించాలని కోరారు. అంతేకాదు కూర్చున్న కొమ్మనే నరుక్కోవద్దని మంత్రిమండలి ఆర్టీసీ కార్మికులను కోరింది. దసరా పండుగ సమయంలో సమ్మెకు వెళ్లడం మంచిది కాదని ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని , సమ్మె ఆలోచనను విరమించుకోవాలని మంత్రిమండలి కోరింది. ఆర్టీసీని కాపాడుకోడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందని మంత్రి మండలి పేర్కొంది .
ఆర్టీసీని కాపాడే కృత నిశ్చయంతో ఉన్నామన్న క్యాబినెట్
ఆర్టీసీని కాపాడాలనే కృత నిశ్చయంతో ఉన్న తెలంగాణా ప్రభుత్వం ఆర్టీసీని నష్టాల బారినుండి కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.ఇక ఈనేపధ్యంలో నేడు క్యాబినెట్ నియమించిన కమిటీ ఆర్టీసీ కార్మిక సంఘాలతో భేటీ కానుంది. వారి డిమాండ్లను, ఆర్టీసీ సమస్యలను పూర్తిగా అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. మరి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.