పార్టీ పై పూర్తి ఆదిపత్యం..! అభ్యర్థులను కూడా ప్రకటించేస్తున్న కేటీఆర్..!!
హైదరాబాద్ : గులాబీ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా బాద్యతలు చేపట్టిన కల్వకుంట్ల తారక రామారావు కర్తవ్యాన్ని కాస్త గట్టిగానే నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీలో తన మార్కేంటో చూపిస్తూ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నారు కేటీఆర్. పోలిట్ బ్యూరో సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా తానే స్వయంగా తీసుకుంటూ పార్టీలో తన మాటకున్న పవర్ ఏంటో చెప్పకనే చెప్తున్నారు. కరీం నగర్లో ఎంపీ అభ్యర్ధిని ప్రకటించడమే ఇందుకు నిదర్శనమనే చర్చ కూడా జరుగుతోంది.
ఇక ఎమ్మెల్సీలు,మంత్రులు, నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న ఆశావహులు కేటీఆర్ ను ప్రసన్నం చేసుకుంటే పనైపోతుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకోసం కేటీఆర్ దర్శన భాగ్యం కోసం రోజూ దాదాపు కొన్ని గంటలు వయో భేదం లేకుండా యువరాజా వారి కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో అదికార గులాబీ పార్టీలో కల్వకుంట్ల తారక రామారావు శకం ఆరభం ఐనట్టు కూడా వార్తలు గుప్పుమంటున్నాయి.
టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ శకం ఆరంభం..! అన్నీ తానై దూసుకుపోతున్న కేటీఆర్..!!
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించిన తర్వాత కేసీఆర్ తీసుకున్న మొదటి నిర్ణయం పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా కేటీఆర్ ను నియమించడం. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా పూర్తిగా పార్టీ వ్యవహారాలన్నీ కేటీఆర్ చేతుల్లో పెట్టారాయన. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం కావాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ పార్టీ బాధ్యతలను కేటీఆర్ కి అప్పగించినట్టు చర్చ జరుగుతోంది. ఇక బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ మొదటి రోజు నుంచే పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ బాధ్యతలు తీసుకోగానే పలు జిల్లాల్లో పర్యటించారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో తానే కీలకం అనే సంకేతాలు పంపిస్తున్నారు కేటీఆర్.
పాలేరులో తుమ్మల భావోద్వేగం..! ఓటమికి తనదే బాధ్యత అంటూ కంటతడి..!!
వర్కింగ్ ప్రసిడెంట్ గా దూకుడు పెంచిన కేటీఆర్..! అభ్యర్థుల ప్రకటనలు షురూ..!!
పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి కేటీఆర్ బిజీగా మారిపోయారు. తరచూ ఆయన పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కి వస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశ మవుతున్నారు. తనవద్దకు వచ్చిన పార్టీ నేతలు అందరినీ కలిసి వారి సమస్యలు వినే అవకాశం ఇస్తున్నారు. ఇక, ఇటీవలి ఎన్నికల్లో పార్టీ భారీ విజయమే సాధించినా కొన్ని సమస్యలను కేటీఆర్ గుర్తించారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతల్లో వర్గపోరును ఆయన పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
యువరాజును ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహుల పడిగాపులు..! తన మార్క్ చూపిస్తున్న కేటీఆర్..!
విభేదాలు ఉన్న నాయకులతో పరస్పరం చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మపురిలో తనను ఓడించేందుకు మాజీ ఎంపీ వివేక్ వర్గం ప్రయత్నించిందని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కేటీఆర్ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో కేటీఆర్ వీరిద్దరితో మాట్లాడి సయోధ్య కుదిర్చారు. ఇక 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటును కూడా కేటీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు.
ఇదే తన మాట..!తన మాటే శాసనం..!! కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్..!!
కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టిన కేటీఆర్ రాష్ట్రం చుట్టేస్తున్నారు. పనిలో పనిగా ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. సాధారణంగా పార్టీ అధ్యక్షులు ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారు. అందుకు భిన్నంగా కేటీఆర్ కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బి.వినోద్ కుమార్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం వినోద్ కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. సిరిసిల్ల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ కీలక ప్రకటన చేశారు. దీంతో గులాబీ పార్టీలో తన ప్రభావం ఏమేరకు ఉందో చెప్పకనే చెప్పారు కేటీఆర్.