థాయిలాండ్ మాజీ ప్రధానిలాగే కేసీఆర్.. జైలుకు వెళ్లడం ఖాయమే : సంపత్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పోకడ నియంత పాలన తలపిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ఆయన వ్యక్తిత్వమేంటో తెలిసిపోతుందని ధ్వజమెత్తారు. అసెంబ్లీని తన రాచరికపు పాలనతో కుటుంబ వ్యవహారంలా మార్చేశారని ఎద్దేవా చేశారు. అసలు సార్థకత లేని విధంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ప్రశ్నించే నేతలను కేసీఆర్ అణచివేయాలని చూడటం దారుణమన్నారు. ఆయన ఇంట్లో తీసుకునే నిర్ణయాలను అసెంబ్లీదాకా తీసుకొచ్చి ఆమోదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అలా అర్థం పర్థం లేకుండా వ్యవహరిస్తూ అసెంబ్లీకి కళంకం తెస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీని మరో ఇంటిలా భావించుకునే క్రమంలోనే కేసీఆర్ బిల్లులపై పూర్తిస్థాయిలో చర్చించడం లేదని ఫైరయ్యారు.
ఆర్టీసీ బస్సు సీజ్.. కొండగట్టు ప్రమాదం పాఠాలు నేర్పిందా..! (వీడియో)
రాజకీయాలు, ఎన్నికలు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోని కేసీఆర్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. థాయిలాండ్ మాజీ ప్రధానిలాగే కేసీఆర్ కూడా చీకటి రోజులు చూడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ప్రజాధనాన్ని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్న కేసీఆర్ భవిష్యత్తులో జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక కేసీఆర్ తీసుకొస్తానంటున్న మున్సిపల్ చట్టంలో ఏముందో మంత్రులకు కూడా తెల్వదని.. ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసని ఫైరయ్యారు.