కాంగ్రెస్ ఖతం, కారు జోరు తగ్గింది : కేసీఆర్ రాజీనామాకు జేజమ్మ డిమాండ్
మహబూబ్నగర్ : కాంగ్రెస్, టీఆర్ఎస్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు జేజమ్మ డీకే అరుణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖతం అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయా పార్టీ నేతలకు బీజేపీ డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయని బహిరంగంగా ప్రకటించారు జేజమ్మ.
చెమటలు పట్టించాం ..
పాలమూరు పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ నేతలకు చెమటలు పట్టించామని పేర్కొన్నారు డీకే అరుణ. ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలిచినా .. నైతిక విజయం బీజేపీదని స్పష్టంచేశారు. మోదీ, అమిత్ షా నేతృత్వంలో బీజేపీ ప్రభంజనం సృష్టించిందని చెప్పారు. దాదాపు 17 రాష్ట్రాల్లో ఖాతా తెరవని పరిస్థితి కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. ఇక రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి సీట్లు తగ్గాయని గుర్తుచేశారు.
రాజీనామా చేయండి ..
నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ కూతురు కవిత ఓడిపోయారని చెప్పారు. పసుపు బోర్డు, చెరకు ఫ్యాక్టరీ తెరిపించే హామీలు నెరవేర్చకపోవడం వల్లే ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. సీఎంగా కవిత ఓటమికి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. ఇదివరకు కంటే టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ తగ్గిందన్నారు. దీంతోపాటు సీట్లు కూడా కోల్పోయిందని గుర్తుచేశారు. దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో ఏ క్షణమైన టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కోరారు జేజమ్మ.
కాంగ్రెస్ ఖతం
ఇదే దేశంలో కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని చెప్పారు. ఆ పార్టీకి 52 సీట్లు రావడమే ఇందుకు సంకేతమని స్పష్టంచేశారు. ఆ పార్టీ ఇక కోలుకోదని జోస్యం చెప్పారు. దేశంలో బీజేపీ హవా మొదలైందని .. ఇక కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ లో ఉన్న నేతలంతా బీజేపీలోకి రావాలని కోరారు. ఇటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు. ఆ పార్టీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకోవడమే ఇందుకు నిదర్శమన్నారు. అదే బీజేపీ 4 సీట్లలో గెలిచి .. తన సత్తాచాటిందని గర్వంగా చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని .. కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం కాదని స్పష్టంచేశారు.