హైకోర్టు అసాధారణ నిర్ణయం: అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శుల కస్టడీకి ఆదేశం
హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకట రెడ్డిల కేసులో హైకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావులను జ్యూడిషియల్ కస్టడీకి తీసుకోవాలని పంపుతూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జ్యూడిషియల్ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేసింది. రూ.10వేల పూచీకత్తుపై విడిచిపెట్టాలని హైకోర్టు ఆదేశించింది.
సభాపతిపై దాడి కేసులో కోమటిరెడ్డి, సంపత్ కుమార్ల తీరును తీవ్రంగా పరిగణించి వారి శాసన సభ్యత్వాలను రద్దు చేసింది. దీనిపై ఆ ఇద్దరు నేతలు హైకోర్టుకు వెళ్లారు. ఆక్కడ వారికి ఊరట లభించింది. వారి శాసన సభ్యత్వాలు పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. కానీ దానిని నాటి అసెంబ్లీ అమలు చేయలేదు.
దీంతో కోర్టు ధిక్కారణ కేసు కింద కోర్టుకు హాజరు కావాలని అసెంబ్లీ కార్యదర్శికి, హోంశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేయగా, వారు హాజరు కాలేదని, దీంతో వారిని కోర్టులో హాజరు పరచాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు ఈ రోజు (శుక్రవారం, ఫిబ్రవరి 15) కోర్టుకు హాజరయ్యారు. దీంతో వారిని కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు చెప్పింది. ఇంతటితో ఆగకుండా మాజీ స్పీకర్ మధుసుదనా చారికి మరోసారి నోటీసులు జారీ చేసింది.
మరోవైపు, గన్మెన్ల పునరుద్ధరణ విషయంలో డీజీపీ, గద్వాల, నల్గొండ ఎస్పీలకు హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గతంలో సంపత్, కోమటిరెడ్డిలకు గన్మెన్లను తొలగించారు. అయితే సెక్యూరిటీనీ పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిని అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో సంపత్కుమార్కు పునరుద్ధరించనందుకు గద్వాల ఎస్పీకి, కోమటిరెడ్డికి పునరుద్ధరించనందుకు నల్గొండ ఎస్పీకి, వీరితో పాటు డీజీపీకి నోటీసులు జారీ చేశారు.