కేసీఆర్ అహంకారం తగ్గించుకో.. తెలంగాణ నీ రాజ్యం కాదు : కాంగ్రెస్
హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ కారు జోరుతో కాంగ్రెస్ డీలా పడింది. అనంతరం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కలిసిరావడం హస్తం గూటిలో ఊపు తెచ్చింది. ఇక లోక్సభ ఎన్నికల వేళ టీఆర్ఎస్కు గండి కొట్టి మూడు స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్తో ఉన్నారు. అది ఇలాగే కంటిన్యూ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేలా అగ్రనేతలు టీఆర్ఎస్ టార్గెట్గా ముందుకెళుతున్నారు.
లోక్సభ ఫలితాల్లో టీఆర్ఎస్ మెజార్టీ తగ్గడం కాంగ్రెస్ నేతలకు అస్త్రం దొరికినట్లైంది. 16 స్థానాల్లో గెలుస్తామంటూ గొప్పగా చెప్పిన టీఆర్ఎస్ నేతలు చివరకు 9 స్థానాలకే పరిమితమయ్యారు. సారు..కారు..పదహారు అంటూ ప్రచారం హోరెత్తించినప్పటికీ.. ఫలితాలు వచ్చే నాటికి సీన్ రివర్సయింది. దాంతో టీఆర్ఎస్ను ఎక్కడికక్కడ ఏకిపారేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు.
అప్పుడు బొక్కబొర్లా.. ఇప్పుడేమో ఫుల్ జోష్
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ బొక్కబొర్లా పడింది. కారు జోరుతో టీఆర్ఎస్ 88 స్థానాలు దక్కించుకోగా.. కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది. ఇక అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే టీఆర్ఎస్ లక్ష్యానికి తోడు.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సగం మంది వరకు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో టీఆర్ఎస్ ఎత్తులను చిత్తు చేయాలనే కసితో కాంగ్రెస్ పార్టీ సమయం కోసం ఎదురుచూస్తోంది.
అలాంటి సందర్భంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలవడం ఆ పార్టీకి కొంత మేర ప్లస్ అయింది. అదే రీతిలో లోక్సభ ఎన్నికల వేళ కూడా కారు జోరుకు బ్రేకులు వేస్తూ మూడు పార్లమెంటరీ స్థానాలు గెలుచుకుంది. అదే ఊపుతో కసి మీదున్న కాంగ్రెస్ పెద్దలు ఇక టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ యుద్ధభేరి మోగించారు. మాటల తూటాలతో టీఆర్ఎస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం కూతురును, కుడిభుజాన్ని ఓడించాం.. కాంగ్రెస్కు చావు తప్పి కన్ను లొట్ట : బీజేపీ
రేవంత్ రెడ్డి పంజా.. కేసీఆర్ టార్గెట్గా మాటల తూటాలు
నియంతలా పాలిస్తున్న సీఎం కేసీఆర్కు గుణపాఠం చెప్పే రీతిలో లోక్సభ ఫలితాలు వచ్చాయంటున్నారు రేవంత్ రెడ్డి. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుందని భావించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని చెబుతున్నారు. తెలంగాణలో ఇష్టారాజ్యంగా సాగుతున్న పాలనను నిలదీయడానికే ప్రజలు తనను ఎన్నుకున్నారని అంటున్నారు. కేసీఆర్ను వదిలే ప్రసక్తి లేదని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ కొడంగల్లో ఏమి జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలుసంటున్న రేవంత్ రెడ్డి.. తనను ఓడించడానికి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ధ్వజమెత్తుతున్నారు. అన్నీ గమనిస్తున్న ప్రజలు లోక్సభ ఫలితాల్లో తగిన బుద్ధి చెప్పారని అంటున్నారు.
కోమటిరెడ్డి ఫైర్.. మేమేంటో చూపిస్తాం
లోక్సభ ఫలితాల్లో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలిందంటున్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత ఓడిపోవడంతో సీఎం కేసీఆర్కు రెండు కళ్లు పోయినట్లుగా ఉందన్నారు. 2014 టర్మ్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంపీలు దద్దమ్మల్లా పనిచేశారని ఆరోపించారు.
ఆ 14 మంది చేయని పని మేం ముగ్గురం చేసి చూపిస్తామంటూ సవాల్ విసిరారు. పసుపు బోర్డు తీసుకురాని కారణంగా నిజామాబాద్ ఓటర్లు కవితను ఓడించారని చెప్పుకొచ్చారు. లోక్సభ ఫలితాల స్ఫూర్తితో టీఆర్ఎస్ను దెబ్బ తీయడమే లక్ష్యంగా భవిష్యత్ ప్రణాళికలు ఉంటాయని చెబుతున్నారు.
వీహెచ్ మొక్కులు.. కేసీఆర్కు అహంకారం పూర్తిగా తగ్గాలట..!
ఇక కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో మండిపడుతున్నారు. లోక్సభ ఫలితాలతో కేసీఆర్కు దిమ్మతిరిగిందని వ్యాఖ్యానించారు కాకా. 16 స్థానాల్లో గెలుస్తామంటూ విర్రవీగిన కేసీఆర్కు తగిన శాస్తి జరిగిందని.. దాంతో ఆయనకు అహంకారం సగం తగ్గిందని ఎద్దేవా చేశారు.
లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఫల్యం చెందిందని.. పదహారు స్థానాల్లో గెలుస్తామని లెక్కలేసుకున్నా కేవలం 9 స్థానాలకే పరిమితమైందన్నారు. కేసీఆర్కు సగం గర్వం తగ్గిందని.. ఆయనకు పూర్తిగా గర్వం తగ్గించాలని తిరుపతి వెంకన్నకు మొక్కుతున్నానని వ్యాఖ్యానించారు.
జీవన్ రెడ్డి గరం.. కేటీఆర్ బొక్కబొర్లా పడ్డావుగా..!
టీఆర్ఎస్ హైకమాండ్ తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి గరమవుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో కేసీఆర్ పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కవిత, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ ఓడిపోవడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన బావ హరీష్ రావుతో పెద్ద ఛాలెంజ్ చేశారని ఎద్దేవా చేశారు. బావ మీకంటే కరీంనగర్ పార్లమెంటరీ స్థానంలో ఒక్క ఓటైనా ఎక్కువ తెచ్చుకుంటామని కేటీఆర్ గొప్పలకు పోయారని వ్యాఖ్యానించారు. తీరా చూస్తే బావ సెగ్మెంట్లో లక్షలకొద్దీ మెజార్టీ వస్తే.. కరీంనగర్లో వినోద్ కుమార్ ఓడిపోవడంతో కేటీఆర్ బొక్కబొర్లా పడ్డారని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్తో పాటు ఆయన తనయుడు కేటీఆర్కు అహంకారం పనికిరాదని హితవు పలికారు.
కోమటిరెడ్డితో మిలాఖత్పై నోరు విప్పిన పైళ్ల.. ఒకసారి కలిశాం.. కానీ..!
ఉత్తమ్ ఆగ్రహం.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేది కాంగ్రెస్సే..!
టీఆర్ఎస్ రానురాను ప్రాభవం కోల్పోతుందని అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ఇతర పార్టీలతో పోల్చి చూసినట్లయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తగినశాస్తి జరిగిందని.. ఎప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేది కాంగ్రెస్ పార్టీయేనని చెబుతున్నారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఫుల్ జోష్లో ఉందని.. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా హస్తం హవా కంటిన్యూ అవుతుందంటున్నారు. రాజకీయాల్లో అహంకారం పనికిరాదని.. కేసీఆర్కు అదే దెబ్బ కొట్టిందని చెబుతున్నారు. ఇక బీజేపీకి పోటీలో నిలిచే స్థాయి లేకున్నా లక్కీగా నాలుగు స్థానాల్లో విజయం సాధించిందని.. ఎప్పటికైనా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి లోక్సభ ఫలితాల బలంతో కాంగ్రెస్ దూకుడు పెంచినట్లైంది. టీఆర్ఎస్ ఏకపక్షంగా కొనసాగిస్తున్న కారు జోరుకు కాంగ్రెస్ నేతలు చేయి అడ్డం పెట్టి ఎలా నిలువరిస్తారో చూడాలి.