ప్రాజెక్టుల రక్షణ బాద్యత కాంగ్రెస్ దే..!కేసీఆర్ ప్రభుత్వంపై యుద్దం చేయకపోతే ప్రమాదమేనన్నఉత్తమ్.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది. నీటి ప్రాజెక్టుల అంశంలో సీఎం చంద్రశేఖర్ రావు ఉదాసీన వైఖరి తెలంగాణ సమాజానికి ఎప్పటికైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాల సిద్దాంతంతో సాధించుకున్న తెలంగాణలో నీటి వనరుల దోపిడీ జరగకముందే ముందస్తు వ్యూహంగా వ్యవహరించాల్సిన అవశ్యకత ఉందని, టీపిసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి సంబంధించిన పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు అంశంలో సీఎం చంద్రశేఖర్ రావు విధానాన్ని తెలంగాణ ప్రాజానికానికి వివరించాల్సిన తరుణం ఆసన్నమైందని, తెలంగాణ ఆవిర్బావం జూన్ 2న అన్ని ప్రాజెక్టుల దగ్గర ఒకరోజు దీక్షచేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.
జూన్ 2న తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం.. అదే రోజు ప్రాజెక్టుల వద్ద ఒకరోజు దీక్షకు కాంగ్రెస్ పిలుపు..
ప్రాజెక్టుల అంశంలో ప్రభుత్వం కల్పిస్తున్న భ్రమలు ప్రజలకు తెలిసొచ్చేలా కార్యాచరణ రూపొందించక పోతే తెలంగాణ సమాజానికి ప్రమాదఘంటికలు తప్పవని టీపీసిసి వివరిస్తోంది. అందుకోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. ప్రాజక్టుల అంశంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్ లైన్ ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. జూన్ రెండవ తేదీన ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలని, నీళ్ళ కోసం ప్రాజెక్టుల నిర్మాణం జరగకుండా, మిషన్ భగీరథ, కొత్త ప్రాజెక్టులను తెర మీదకు తెచ్చింది కేవలం సీఎం చంద్రశేఖర్ రావు జేబులు నింపుకునేందుకే అనే అంశం ప్రజలకు వివరించాలని తెలంగాణ కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రాజెక్టుల అంశంలో కేసీఆర్ ఉదాసీన వైఖరి.. తెలంగాణ సమాజానికి ప్రమాదమన్న కాంగ్రెస్..
అంతే కాకుండా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణానదిలో పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలిస్తారని డిసెంబర్ లో ప్రకటించిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి, సీఎం చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ రాశారు. కృష్ణా నీటి వినియోగం, సౌలభ్యత, నిలువల అంశంపై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం జగన్, సీఎం చంద్రశేఖర్ రావు హైదరాబాద్ లో నాలుగు గంటల పాటు సమావేశమై కుట్రలు పన్నారని, పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కులు, సంగమేశ్వరం నుంచి మూడు టీఎంసీల నీరు ప్రతిరోజు ఆంధ్ర ప్రదేశ్ తీసుకువెళ్లేందుకు కుట్ర జరుగుతోందిని అందుకు సీఎం చంద్రశేఖర్ రావు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది.
కేసీఆర్, జగన్ స్నేహంలో స్వార్ధం.. ఇరు సీఎంలు కుమ్ముక్కయ్యారన్న టీ కాంగ్రెస్..
తెలంగాణ ప్రాజెక్టుల నుండి ఏపీ నీళ్లు తోడేస్తే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని, ఇంత జరుగుతున్నా సీఎం చంద్రశేఖర్ రావు మౌనం వహించడం భావితరాలకు శ్రేయస్కరం కాదని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి రెండు టీఎంసీల నీటిని తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రశేఖర్ రావు లక్ష కోట్లు ఖర్చు చేశారని, దక్షిణ తెలంగాణ లోని జిల్లాల వనరులను ఇందుకోసం తాకట్టు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్ళే అవకాశం ఉన్నా ఆరేళ్లలో సుధీర్ఘ సమయంలో టన్నెల్ నిర్మాణం చేయనందున అది సాద్యం కాలేదని వివరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
తెలంగాణ ప్రజానికానికి వాస్తవాలు వివరిస్తాం.. ప్రాజెక్టులను కాపాడతామన్న ఉత్తమ్..
తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరైనా మాట్లాడితే వాళ్లను దూషించడం, ప్రతిపక్షాలను చులకన చేసి నిందించడం, మీడియాను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం వంటి అప్రజాస్వామిక కార్యక్రమాలకు సీఎం చంద్రశేఖర్ రావు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరేళ్ల తర్వాత కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు వందశాతం పూర్తి కాలేదో చెప్పాల్సిన బాద్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు సీఎం చంద్రశేఖర్ రావు కు రాజకీయ జీవితం ఇచ్చారని, ఈ జిల్లాలో నిధులు ఖర్చు చేయడం ద్వారా తనకు పెద్దగా ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో ఇతర జిల్లాల్లో ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్నాడని సీఎం పై ధ్వజమెత్తారు. జూన్ 2వ తేదీన మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ప్రాజెక్టుల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఒకరోజు దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు టీపిసిసి నేతలు.