అవి ప్రభుత్వ హత్యలే.. కంటతడి పెట్టిన వీహెచ్.. కేసీఆర్కు చురకలు
హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల తప్పిదాలతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే ఆ ఆత్మహత్యలన్నీ.. ప్రభుత్వ హత్యలేనంటూ ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు. ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలో 23 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం విచారకరమని అన్నారు. సీఎం కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా మారిందని.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు.
శారద పీఠాధిపతి ఆశీర్వచనాలకు సమయముండే కేసీఆర్ కు.. ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల కుటుంబాలను పరామర్శించడానికి మాత్రం టైమ్ లేదని ఎద్దేవా చేశారు. స్వాముల వైపు కన్ను పెట్టే కేసీఆర్.. ఇటు జనాలను కూడా చూడాలని చురకలు అంటించారు.
ఇక ఆయన తనయుడు కేటీఆర్ కు ట్వీట్లు పెట్టడం తప్ప.. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించకపోవడం విడ్డూరమన్నారు. ప్రభుత్వ తప్పిదంతో ఇంటర్ ఫలితాల్లో గందరగోళం ఏర్పడి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచన కేసీఆర్ కు లేకపోవడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన వీహెచ్ కంటతడి పెట్టారు.