ఉద్యోగాలేవీ, మద్దతు ధరలేవీ.. కేసీఆర్ సర్కార్పై జీవన్ రెడ్డి నిప్పులు
టీఆర్ఎస్ సర్కార్పై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విరుచుకుపడ్డారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల ఊబిలోకి నెట్టారని ఫైరయ్యారు. జీవన్ రెడ్డి గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ధనిక రాష్ట్రం తెలంగాణ.. ఇప్పుడు అప్పుల ఊబిలోకి వెళ్లడానికి కేసీఆర్ కారణం అని ధ్వజమెత్తారు.
అన్నీ వర్గాలను కేసీఆర్ మోసం చేశారని జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. పీఆర్సీ పేరుతో ఉద్యోగులను మోసం చేశారని తెలిపారు. కేసీఆర్ మోసం చేయనిది ఎవరూ అని అడిగారు. కేసీఆర్ ధ్యాస అంతా.. కుమారుడు, కుమార్తెపై మాత్రం ఉందన్నారు. కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని ఊవ్విళ్లురుతున్నారని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న చర్యలను బట్టి అర్థమవుతోందన్నారు. కూతురు కవితను మంత్రివర్గంలోకి తీసుకునే సమయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.
సీఎం ఇంట్లో వారికి జాబ్ కల్పిస్తోన్న కేసీఆర్ యువతను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. వారికి ఉద్యోగాలు లేవని.. ఆ ఊసే మరచిపోయారని చెప్పారు. రైతుల గోడును కూడా పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పారు. పంటలకు మద్దతు ధర ఇవ్వడం లేదని చెప్పారు. దీంతో అన్నదాత పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యిందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువత పోరాడాలని జీవన్ రెడ్డి సూచించారు. యూత్ కాంగ్రెస్ పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమయ్యిందని చెప్పారు.
నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని మంత్రి కేటీఆర్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే జీవన్ రెడ్డి నిరుద్యోగుల గురించి కామెంట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటు పీసీసీ చీఫ్ పదవీ జీవన్ రెడ్డికి ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాతే ఆయన యాక్టివ్గా కామెంట్లు చేస్తున్నారు. కానీ చీఫ్ ఎంపిక మాత్రం సాగర్ బై పోల్ తర్వాతేనని కాంగ్రెస్ హై కమాండ్ తేల్చిచెప్పింది.