కాకా స్టైలే వేరుగా.. సొంత గూటి నేతలకు ఫిట్టింగ్ పెట్టారుగా..!
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు స్టైలే వేరు. అపొజిషన్ నేతలైనా, సొంతగూటి నేతలైనా.. సందర్భం వస్తే ఎవరని చూడరు. ఏకిపారేస్తూనే ఉంటారు. కొందరు వీహెచ్ను భోళాశంకరుడిగా అభివర్ణించినా.. మరికొందరు నోటిదురుసు ఎక్కువంటూ ఆరోపించినా.. ఆయన వైఖరి మాత్రం మారదు. ఆయన ఆయనలాగే ఉండాలనుకుంటారు. ఆ క్రమంలో ఆయన మాట్లాడిన తీరు మరోసారి చర్చానీయాంశమైంది.
అపొజిషన్ నేతలను చెడుగుడు ఆడతారనే పేరున్న వీహెచ్.. ఈసారి సొంత గూటి నేతలను టార్గెట్ చేశారు. పార్టీ నేతల తీరు సరిగా లేదంటూ అంసతృప్తి వెళ్లగక్కారు. పంజాగుట్ట సెంటర్లో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగిస్తే కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా నోరు విప్పి మాట్లాడలేదని వాపోయారు. దళితులు కూడా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నా కూడా వారిలో చలనం లేదని ఆరోపించారు. తనను అరెస్ట్ చేసిన సందర్భంలోనూ ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా పట్టించుకోలేదన్నారు.
ఫారెస్ట్ మహిళా అధికారిపై దాడి హేయనీయం.. కాంగ్రెస్ పార్టీకి అస్త్రం.. రాజ్యసభలోనూ చర్చ
కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం కోసం పోరాడతానంటూ వ్యాఖ్యానించారు వీహెచ్. పనిలోపనిగా ప్రభుత్వంపై కూడా ఆరోపణాస్త్రాలు సంధించారు. కొత్త సచివాలయం నిర్మించడం ఎందుకని ప్రశ్నించిన వీహెచ్.. ఎట్టిపరిస్థితుల్లో దాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఒకవేళ ఎవరు అడ్డుకున్నా.. కేసీఆర్ సచివాలయం నిర్మించినట్లైతే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ భవనాలను బలహీన వర్గాల కోసం వినియోగించాలని కోరారు. కల్యాణ మండపం, గ్రంథాలయాలుగా మార్చితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.