కేటీఆర్ రమ్మన్నారు, వ్యక్తిగత ద్వేషం లేదు, ఆ కసితో గజ్వెల్లో పోటీ చేశా: టీఆర్ఎస్లో చేరిన వంటేరు
హైదరాబాద్: 2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై పోటీ చేసిన గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంటేరు మాట్లాడారు.
కేటీఆర్ తనను రెండుసార్లు తెరాసలోకి ఆహ్వానించినా తాను వెళ్లలేదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు రైతుల పక్షాన నిలబడి తాను అనేక లాఠీ దెబ్బలు తిన్నానని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు సరైనవని ప్రజలు తీర్పు ఇచ్చారని, అందువల్ల ఆయన నిర్ణయాలే కరెక్టు అని గ్రహించానని చెప్పారు. అందుకే సీఎం నిర్ణయానికి కట్టుబడి తాను తెరాసలో చేరినట్టు చెప్పారు.
తాను ఎమ్మెల్యేగా పనిచేయాలనే కసితోనే గజ్వేల్లో పోటీ చేశానన్నారు. సీఎం బరిలో ఉన్నారు ఇంకా తానెక్కడ గెలుస్తానని అనుకోకుండా ఎమ్మెల్యే కావాలన్న తాపత్రాయంతోనే గజ్వేల్లో తెరాసతో కొట్లాడినట్టు చెప్పారు. అంతేతప్ప తనకు కేసీఆర్ పట్ల ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. ఇదివరకే తాను తెరాసలో చేరి ఉంటే ఎంతో బాగుండేదన్నారు. తనకు పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా చిత్తశుద్ధితో పని చేస్తానని, పార్టీకి, కేసీఆర్, కేటీఆర్లకు మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు..
వంటేరు చాలా ఓపెన్ గురూ.. టీఆర్ఎస్లో ఎందుకు చేరుతున్నాడో దాచుకోకుండా చెప్పేశారు
కేసీఆర్ గతంలో పలుమార్లు ఆహ్వానించినా రాలేదు
2014కు ముందు, 2014లో, 2018లో తనను రమ్మంటే రాలేదని, ఈసారి గట్టిగా రమ్మని చెబితే పార్టీలో చేరానని వంటేరు చెప్పారు. కేసీఆర్ రెండోసారి భారీ మెజార్టీతో గెలిచారన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు నేరుగా పేదల జేబుల్లోకి వెళ్లాయన్నారు. అందుకే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని చెప్పారు.
కేసీఆర్ పైన వ్యక్తిగత ద్వేషం లేదు
రైతాంగమంతా కేటీఆర్కు ఓటేసిందని వంటేరు చెప్పారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదని చెప్పారు. సంక్షేమ పథకాలే తెరాసను గెలిపించాయన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ చాలా చేశారన్నారు. కేసీఆర్ పైన తనకు వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పారు. కేసీఆర్ పిలుపు మేరకు తెరాసలో చేరుతున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వైపు ఉన్నారని చెప్పారు. గజ్వెల్ అభివృద్ధి కోసమే తాను తెరాసలో చేరుతున్నానని వంటేరు చెప్పారు. టీఆర్ఎస్ గెలిచిన చోట అద్భుత మెజార్టీ వచ్చిందని, విపక్షాలు గెలిచిన చోట తక్కువ మెజార్టీ వచ్చిందని చెప్పారు.
తెరాసలో చేరుతున్నా, నా పోరాటాలు సరికాదు
ప్రజలు అందరు కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెంటే ఉన్నారని, అందుకే తాను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరుతున్నానని అంతకుముందు వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. పదవులు, డబ్బుల కోసం తాను తెరాసలోకి వెళ్లడం లేదన్నారు. ఏదో ఒకరోజు గజ్వెల్ నియోజకవర్గంలో గెలవాలనే ఉద్దేశ్యంతోనే తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. తన పోరాటాలు సరికాదని, ఇక కేసీఆర్ తనకు బాస్ అని చెప్పారు.