రాములమ్మ గుస్సా: కేసీఆర్వి తప్పుడు సర్వేలు, దుబ్బాక ఫలితంతో తేలింది..
దుబ్బాక పోరు ముగిసింది. ముందుంది బల్దియా పోరు. గ్రేటర్ పీఠంపై పాగా వేయాలని ప్రధాన పార్టీలు భావిస్తోన్నాయి. దుబ్బాకలో మాదిరిగా టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కార్యాచరణ రచించి ముందుకెళుతున్నాయి. ఇక కేసీఆర్ అంటే అస్సలు పడని రాములమ్మ విజయశాంతి ఒకడుగు ముందువేశారు. సర్వేల పేరుతో కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
సర్వే అబద్దం..
గ్రేటర్లో టీఆర్ఎస్/ కేసీఆర్ సర్వే అబద్దం అని విజయశాంతి విరుచుకుపడ్డారు. అందులో అన్నీ లోపాలేనని.. అవకతవకలతో సర్వే చేశారని విరుచుకుపడ్డారు. ఇప్పుడే కాదు ప్రతీసారి ఇలానే చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేందుకు దుబ్బాక ఉప ఎన్నికలో కూడా సర్వే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేశారని ఆరోపించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం వేరు అని చెప్పారు. జనం మాత్రం టీఆర్ఎస్పై వ్యతిరేకత చూపించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
మీకెందుకు లేదు సానుభూతి..
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం సానుభూతి అని కేసీఆర్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని విజయశాంతి అన్నారు. రఘునందన్ రావు అంటే ఎందుకు సానుభూతి అని అడిగారు. రెండుసార్లు ఓడిపోతే.. మూడోసారి గెలిపించారా అని నిలదీశారు. మరీ భర్తను కోల్పోయిన సోలిపేట సుజాతకు ఎందుకు పట్టం కట్టలేదన్నారు. ఆమెపై ఎందుకు సానుభూతి చూపించలేదని నిలదీశారు. కేసీఆర్ చెప్పిన సానుభూతి అయితే.. ఓటర్లు సుజాత వైపు ఎందుకు నిలవలేదో చెప్పాలన్నారు.
హడావిడిగా ఎందుకు..
గ్రేటర్ ఎన్నికలను ఇంత హడావిడిగా ఎందుకు నిర్వహిస్తున్నారు అని విజయశాంతి అడిగారు. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి ఎఫెక్ట్ పడకూడదని అనుకుంటున్నారా అని అడిగారు. లేదంటే ఎంఐఎంకి తలొగ్గారా అని నిలదీశారు. మజ్లీస్ అంటే టీఆర్ఎస్ పార్టీ భయపడుతోందని చెప్పారు. అందుకే బల్దియా ఎన్నికల కోసం వేగంగా పావులు కదుపుతోందని చెప్పారు. లేదంటే ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని పేర్కొన్నది.