దాడులు జరుగుతున్నాయి.. భద్రత కావాలి.. డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు సెక్యూరిటీ పెంచాలని కోరుతూ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ నేతలపై జరిగిన దాడుల గురించి ఆయనకు వివరించారు. తనతో పాటు పొన్నం ప్రభాకర్, వంశీచంద్ రెడ్డి, రోహిత్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. పోలింగ్ సమయంలో కాంగ్రెస్ లీడర్లపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో డీజీపీ ని అడిగి తెలుసుకున్నారు.
మంగళవారం జరగనున్న కౌంటింగ్ సందర్భంగా కూడా కాంగ్రెస్ నేతలపై దాడులు జరిగే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్లకు భద్రత పెంచాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన డీజీపీ.. భద్రత పెంచే విషయంలో ఆయా జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై దాడులు చేసిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.