ప్రాజెక్టుల పేరిట నాటకాలొద్దు.. హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్
హైదరాబాద్ : ప్రాజెక్టులపై కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు చాలా కట్టామని ఆ పార్టీ నేతలు అంటుంటే.. టీఆర్ఎస్ నేతలు మాత్రం వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను విస్మరించిందని ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు టార్గెట్గా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టలేదని హరీష్ రావు వ్యాఖ్యానించడం విడ్డూరమన్నారు జగ్గారెడ్డి. ఈ విషయంలో ఆయన బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. శనివారం నాడు గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడిన జగ్గారెడ్డి పలు అంశాల ప్రస్తావించారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడెక్కడ ప్రాజెక్టులు కట్టామో స్వయంగా తాను తీసుకెళ్లి చూపిస్తానంటూ చెప్పుకొచ్చారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం.. కాళేశ్వరం విశిష్టతలేంటంటే..!
కేవలం ఒకే ఒక్క ప్రాజెక్టుతో టీఆర్ఎస్ నేతలు హంగామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇంత ఆర్భాటామా అంటూ ప్రశ్నించారు. అంబేడ్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరంగా మార్చి.. తమ గొప్పగా ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇప్పుడు కట్టిన కాళేశ్వరం నీళ్లు ఎందులో నింపుతున్నారో హరీష్రావు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో.. రాష్ట్రానికి తాము ఏమి చేశామో ప్రజలకు అంతా తెలుసన్నారు జగ్గారెడ్డి. టీఆర్ఎస్ నేతలు కావాలని కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం సరికాదని హితవు పలికారు. అదేవిధంగా కాంగ్రెస్ లీడర్లు ఏనాడు ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూడలేదని, ప్రాజెక్టుల పేరిట జరిగిన అవినీతి గురించి మాత్రమే ప్రశ్నించామన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులే కట్టలేదనే టీఆర్ఎస్ నేతల ఆరోపణలు సరికాదన్నారు. శ్రీశైలం, దేవాదుల, సింగూరు, మంజీరా, నాగార్జునసాగర్, జూరాల, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పీ, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ కాదా అంటూ ప్రశ్నించారు జగ్గారెడ్డి.