తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తిరగబడుతున్న జనం .! చైతన్యమా .. రాజకీయ కక్షలా ?
హైదరాబాద్ : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించి 88 స్థానాలు కైవసం చేసుకుంది టీఆర్ఎస్ పార్టీ. 19 స్థానాల్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీకి రానురాను ఎమ్మెల్యేల ఫిరాయింపు తలనొప్పిగా తయారైంది. హస్తం గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు ఎక్కుతుండటంతో ఆ పార్టీశ్రేణుల్లో కలవరం మొదలైంది. అయితే తాజాగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి మారిన ఇల్లెందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావుకు చేదు అనుభవం ఎదురవడం హాట్ టాపికయింది.
నువ్వా, నేనా కాదు.. మనలో గెలిచేది ఎవరు?.. రంగారెడ్డి పరిషత్ పోరులో పెరిగిన అభ్యర్థులు
గెలిచేది అక్కడ.. చేరేది ఇక్కడ
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కుంటూ టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందంటూ ఫైరవుతూనే ఉన్నారు. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 19 స్థానాలనే చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఒక్కో స్థానం చేజారుతుండటం ఆందోళన కలిగించే పరిణామం. ఆ 19 స్థానాల్లో ఇప్పటికే సగానికి పైగా ఎమ్మెల్యేలు హస్తానికి బై బై చెప్పి కారులో షికారు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు జనాల నుంచి చేదు అనుభవం ఎదురవుతుండటం చర్చానీయాంశమైంది.
రాజకీయ ఎత్తుగడ.. జనాల్లో చైతన్యమా?
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు చేదు అనుభవం ఎదురైంది. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామంలో ప్రజలను ఆయన్ని నిలదీశారు. కాంగ్రెస్ టికెట్ మీద పోటీచేసి గెలిచిన మీరు.. పార్టీ ఎందుకు మారారంటూ ప్రశ్నించారు. అంతా మీ ఇష్టమేనా.. మరి ప్రజల తీర్పు ఏమవుతోందంటూ గట్టిగా అడిగారు.
కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి.. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రచారానికొచ్చారా అంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి తోపులాటకు దారితీయడంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. శనివారం నాడు ఇల్లెందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి ప్రచారానికి వెళ్లినప్పుడు ఆమెను అడ్డుకోవడంతో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకునే వరకు వెళ్లింది.
పొన్నం వ్యాఖ్యలు.. హైకమాండ్ ఆదేశమా?
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని, హస్తం గుర్తుపై గెలిచి ఇతర పార్టీలోకి వెళితే చెప్పుతో కొడతామన్నారు. అదలావుంటే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ గూటికి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు హరిప్రియ, రేగ కాంతారావుకు క్షేత్రస్థాయిలో చేదు అనుభవం ఎదురు కావడం గమనార్హం. పార్టీ హైకమాండ్ సూచనల మేరకే.. ఈ ఇద్దరిని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారేమోననే వాదనలు వినిపిస్తున్నాయి.
అదలావుంటే కొందరు నేతలు కావాలనే తనపై దాడి చేయించారనేది హరిప్రియ ఆరోపణ. ప్రజలను రెచ్చగొట్టి తనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రచారంలో అడ్డుకున్నారని వాపోయారు. రాష్ట్రంలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారితే.. తనను ఒక్కదానినే టార్గెట్ చేయడమేంటని ప్రశ్నించారు. గిరిజన మహిళను కావడంతోనే తనపై కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ డ్రగ్స్తో 5 గంటల మత్తు.. సెక్స్ కోరికలు.. మహిళలతో నేరగాళ్ల పైశాచికానందం..!
పార్టీ మారను.. పొన్నం బాండ్ పేపర్
మొత్తానికి పార్టీ ఫిరాయింపుల లొల్లి ఆ విధంగా జరుగుతుంటే.. లోక్ సభ ఎన్నికల వేళ కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ బాండ్ పేపర్ రాసివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనను ఎంపీగా గెలిపిస్తే.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని.. ఎట్టిపరిస్థితుల్లో పార్టీ మారబోనంటూ రాసిన బాండ్ పేపర్ ప్రతులను ప్రజలకు పంచారు.
ఎన్నికల ప్రచారంలో కొందరు తనను పార్టీ ఫిరాయింపులపై ప్రశ్నించిన కారణంగానే పొన్నం ఆ నిర్ణయం తీసుకున్నారనే టాక్ నడిచింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళుతుంటే.. అసలు కాంగ్రెస్ నుంచి ఎంపీగా మీరు పోటీ చేయడం అవసరమా అనే ప్రశ్నలు ప్రజల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.