సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో రాష్ట్రంపై రూ.40వేల కోట్ల భారం: జీవన్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంపై 40 వేల కోట్ల రుపాయాలకు పైగా భారం పడిందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టును తమ్మిడిహట్టి వద్ద నిర్మించి ఉంటే ఇప్పటికే సుందిళ్లకు జలాలను తరలించే అవకాశం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ప్రజలపై అదనపు భారం పడకుండా ఉండడంతోపాటు వేల కోట్ల రుపాయాల ప్రజా ధనం వృధా కాకుండా ఉండేదని అన్నారు.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం పర్యాటక రంగానికి మాత్రమే పనికొచ్చే అవకాశం ఉందని ఆయన జీవన్ రెడ్డి అన్నారు. ఇక ఇప్పటికైన సీఎం కేసీఆర్ ఆలోచన మార్చుకుని తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ, అన్నారం ఎత్తిపోతలతో అదనపు భారంతో పాటు కీలకమైన సమయం కూడా వృథా అయిందని ఆరోపణలు చేశారు.
ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందనే ఆలోచనతోనే తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించలేదని విమర్శించారు. కేసీఆర్ మొండి వైఖరితోనే ప్రాజెక్టు వ్యయంపై అదనపు భారం పడుతుందని అన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు మీడియా ప్రతినిధులను తీసుకెళ్తానని చెప్పిన సీఎం వారిని తమ్మిడిహట్టి వద్దకు కూడా తీసుకెళ్ళాలని కోరారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మీడీయా వారిని తీసుకెళ్తామని ప్రకటించారు.