టీఆర్ఎస్ ఎంపీలు దద్దమ్మల్లా పనిచేశారు.. మేం ముగ్గురమేంటో చూపిస్తాం : కోమటిరెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ కారు జోరుతో కాంగ్రెస్ డీలా పడింది. ఆ తర్వాత వచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలవడం ఆ పార్టీకి కాస్తా ఊపు తెచ్చింది. ఇక లోక్సభ ఎన్నికల వేళ టీఆర్ఎస్కు గండి కొట్టి మూడు స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీశ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తూ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేలా అగ్రనేతలు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు.
అదలావుంటే లోక్సభ ఫలితాల స్ఫూర్తితో ముందుకెళతామంటున్నారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మొన్నటి ఫలితాలతో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ తగిలిందని వ్యాఖ్యానించారు. ఆయన ఎంపీగా గెలిచిన సందర్భంగా గాంధీభవన్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు పార్టీశ్రేణులు. ఆ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు.
------------------------
ఆసరా
పింఛన్లు
డబుల్..
జూన్
నుంచే
అమలు..
ఉత్తర్వులు
జారీ-----------------------
కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత ఓడిపోవడంతో సీఎం కేసీఆర్కు రెండు కళ్లు పోయినట్లుగా ఉందన్నారు కోమటిరెడ్డి. 2014 టర్మ్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంపీలు దద్దమ్మల్లా పనిచేశారని ఆరోపించారు. ఆ 14 మంది చేయని పని మేం ముగ్గురం చేసి చూపిస్తామంటూ సవాల్ విసిరారు. పసుపు బోర్డు తీసుకురాని కారణంగా నిజామాబాద్ ఓటర్లు కవితను ఓడించారని చెప్పుకొచ్చారు.
సీఎం కేసీఆర్ నియంత పాలన సరికాదని.. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుకు నిధులు ఇస్తే కోమటిరెడ్డికి పేరు వస్తుందనే కారణంతో పక్కకు పెట్టారని ఆరోపించారు. పంచాయతీల్లో సర్పంచులుగా గెలిచి నాలుగైదు నెలలవుతున్నా.. ఇంతవరకు చెక్కు పవర్ ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పజెప్పి కమీషన్లు దండుకున్నారని ఫైరయ్యారు.